
వైఎస్సార్ సీపీ ధర్నాల్లో స్వల్ప మార్పు జరిగింది. ఈ నెల 11న జరగాల్సిన రైతాంగ సమస్యలపై ధర్నా 13కి వాయిదా పడింది.
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ సీపీ ధర్నాల్లో స్వల్ప మార్పు జరిగింది. ప్రజా సమస్యలపై ఉద్యమ బాటలో భాగంగా ఆ పార్టీ ఈ నెల 11న రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన రైతుల సమస్యలపై ఆందోళన కార్యక్రమాన్ని 13వ తేదీకి వాయిదా వేసింది. ఐదు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోడ్ ఉన్నందున వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. 13న రైతాంగ సమస్యలపై జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించింది. మిగతా కార్యక్రమాలు యథాతథంగా జరగనున్నాయి.
కూటమి ప్రభుత్వ మోసాలను నిలదీసి, ప్రజా సమస్యలపై ఉద్యమబాటకు వైఎస్ జగన్ ఇప్పటికే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా రైతు సమస్యలపై ఈ నెల 13న, కరెంటు ఛార్జీల మోతపై 27న, విద్యార్ధులకు బాసటగా ఫీజు రీఇంబర్స్మెంట్పై జనవరి 3 న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.
కూటమి ప్రభుత్వంలో వ్యవసాయ రంగం కుదేలైంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్బీకేలు స్థాపించి, ఈ–క్రాప్ పెట్టి పారదర్శకంగా ప్రతి రైతుకు ఆర్బీకే ద్వారా ఉచిత పంటల బీమా అందించింది. దళారుల వ్యవస్థ లేకుండా ధాన్యం నేరుగా రైతు వద్దకే వచ్చి కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టింది. చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత ఏ రైతుకూ ధాన్యానికి కనీస మద్దతు ధర రావడం లేదని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: దుర్మార్గ పాలనపై పోరాటం: వైఎస్ జగన్