కేసీఆర్ మోకాళ్ల మీద నడిచినా ఓట్లెయరు
నయీం లాంటోడే చంపాలని చూస్తే భయపడలేదు : ఈటల
కమలాపూర్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మోకాళ్ల మీద నడిచినా, మోచేతుల మీద పబ్బతి పట్టినా టీఆర్ఎస్కు హుజూరాబాద్ ప్రజలు ఓట్లు వేయరని మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం బత్తినివానిపల్లిలోని హనుమాన్ దేవాలయంలో శనివారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బత్తినివానిపల్లి, గోపాల్పూర్, శనిగరం, మాదన్నపేట, గూనిపర్తి గ్రామా ల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ..నేను మీకు బక్క పలుచగా కనిపిస్తుండొచ్చని కానీ, చిచ్చర పిడుగునని మాత్రం సీఎం కేసీఆర్ మరిచిపోవద్దన్నారు. ప్రగతి భవన్లో ప్లాన్లు వేసేది కేసీఆర్ అయితే, వాటిని అమలు చేస్తున్నది హరీశ్రావు అన్నారు. నయీం లాంటోడే చంపాలని చూసినా తాను భయపడలేదని, తనకు గన్మెన్లను తొలగించినంతమాత్రాన భయపడిపోతానా అని ప్రశ్నించారు.
తాను నమ్ముకున్నది గన్మెన్లను కాదని ప్రజలనని స్పష్టం చేశారు. తనకు ఏమైనా జరిగితే ఒక్క హుజూరాబాద్లోనే కాదు యావత్ రాష్ట్రం కన్నీరు పెడుతుందని చెప్పారు. దసరాకు మందు, మాంసం, నగదు ఇస్తారని ప్రచారం జరుగుతోందని, అవన్నీ తీసుకుని ఓటు మాత్రం కమలం పువ్వుకే వేయాలని ఆయన కోరారు.