సాక్షి వికారాబాద్: కేసీఆర్ పై చర్యలు తీసుకునే దమ్ము, దైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉందా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం ఆయన వికారాబాద్లో మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చర్యలు తీసుకోకుండా సీఎం రేవంత్ రెడ్డిని ఏ శక్తి ఆపుతుందని అడిగారు.సోనియా గాంధీ కుటుంబం, కేసీఆర్ ఫ్యామిలితో కుమ్మక్కైన మాట వాస్తవం కాదా అనే దానికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలన్నారు.
నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగిన అగ్నిప్రమాద ఘటన ఎన్నో అనుమానాలకు తావిస్తోందని ఓటుకు నోటు లాంటి కీలక కేసులు విచారణలో ఉండగా అగ్నిప్రమాదం జరగడం ఏంటన్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
గత రెండున్నర ఏళ్లుగా BRS, కాంగ్రెస్ రెండు పార్టీలు డూప్ డైలాగ్ లు కొడుతూ కాలం వెల్లదీస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్యాంట్ లో తొండలు వేస్తా, గుడ్లు పీకుతా, నాలుక కోస్తా, జైల్లో చిప్ప కూడు తినిపిస్తా అంటూ రేవంత్ డమ్మీ డైలాగ్ లతో టైంపాస్ చేస్తున్నారని కేంద్రమంత్రి విమర్శించారు. ఇక ఇది చాలక తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆ దమ్ము రేవంత్ కెక్కడిదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
బీజేపీ భూజాల మీద బంధూకు పెట్టి ఎక్కువ రోజులు నాటకాలు ఆడలేరని సీఎం పదవికి విలువ ఉంటుందని అనవసరంగా సీఎం బాధ్యతను ఇంకొకరిపై నెట్టకుడదని ఈసందర్భంగా కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి సూచన చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే BRS, కాంగ్రెస్ ప్రభుత్వాల అవినీతి పై విచారణ చేస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.


