టికెట్‌కు రూ.50 లక్షలు డిమాండ్ | Sakshi
Sakshi News home page

టికెట్‌కు రూ.50 లక్షలు డిమాండ్

Published Thu, Mar 4 2021 5:17 AM

TDP Politics In Visakhapatnam - Sakshi

డాబాగార్డెన్స్‌ (విశాఖ దక్షిణ): పార్టీని నమ్ముకున్న వారిని మోసగించి.. వ్యక్తులను నమ్ముకున్న వారికే టీడీపీ టికెట్లు కేటాయించిందని ఆ పార్టీ విశాఖ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బాపూ రామానంద్, ఆ పార్టీ 31వ వార్డు అధ్యక్షుడు దొడ్డి బాపూ ఆనంద్‌ విమర్శించారు. టికెట్లు కేటాయించడంలో జరిగిన అన్యాయంపై ‘వేలంలో వీరులు.. కండువా విసర్జన మహోత్సవం’ పేరిట బుధవారం విశాఖపట్నంలో నిరసన తెలిపారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. బాపూ ఆనంద్‌కు టికెట్‌ ఇవ్వలేదని ప్రశ్నిస్తే.. సాక్షాత్తు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తప్పయిపోయిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

అలాంటి వ్యక్తి ఉంటే ఏంటి? లేకపోతే ఏంటి? వాస్తవంగా చెప్పాలంటే అటువంటి వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడి పదవికి అనర్హుడు.. అని పేర్కొన్నారు. గతేడాది పార్టీ అభ్యర్థిగా బీ–ఫారం ఇచ్చి ఇప్పుడు తప్పించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. టికెట్‌ కోసం రూ.10 లక్షలే ఉన్నాయంటే లేదు.. రూ.50 లక్షలు కావాలని డిమాండ్‌ చేశారని వాపోయారు. ఒక చౌదరి ఎమ్మెల్యే.. మాజీ మంత్రి అరాచకం వల్లే టికెట్‌ రాకుండా పోయిందన్నారు. చివరివరకు నమ్మించి మోసగించినందుకు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలోనే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement