అ‍చ్చం ప్రధానిలాగే చేసిన సీఎం | Suvendu Adhikari Dandavat Pranam at Bengal Assembly | Sakshi
Sakshi News home page

అ‍చ్చం ప్రధానిలాగే చేసిన సీఎం

May 13 2026 4:41 PM | Updated on May 13 2026 4:58 PM

Suvendu Adhikari Dandavat Pranam at Bengal Assembly

కోల్‌కతా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అనుసరిస్తూ పశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి సువేందు అధికారి బుధవారం శాసనసభలోకి ప్రవేశించే ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం వేళ సువేందు అధికారి శాసనసభకు చేరుకున్నారు. సభలోకి ప్రవేశించే ముందు, గౌరవ సూచకంగా శాసనసభ మెట్లపై  సాష్టాంగ నమస్కారం చేశారు.

కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో మే 9న జరిగిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  సాష్టాంగ నమస్కారం చేస్తూ వేదికపై ప్రజలకు నమస్కరించిన విషయం తెలిసిందే. ఇటీవల ముగిసిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ఘన విజయాన్ని అందించినందుకుగానూ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన అలా చేశారు. ఆ సమయంలో మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

బాధ్యతలు చేపట్టిన వెంటనే పశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి ఆరు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆరోగ్య పథకం ఆయుష్మాన్ భారత్ అమలు చేయడం, 45 రోజుల్లో బంగ్లాదేశ్ సరిహద్దు వెంట కంచె నిర్మాణం చేపట్టేందుకు సరిహద్దు భద్రతా దళానికి భూమి కేటాయించడం వాటిలో ఉన్నాయి.

నందిగ్రామ్ స్థానానికి రాజీనామా
పశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన సువేందు అధికారి తాను భవానీపూర్ అసెంబ్లీ స్థానంలో ఎమ్మెల్యేగా కొనసాగుతానని, నందిగ్రామ్ స్థానానికి రాజీనామా చేస్తానని బుధవారం ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బీజేపీ పూర్తిగా ఓడించడమే కాకుండా.. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కూడా ఆమె ​కంచుకోటలాంటి భవానీపూర్‌లో ఓడించింది. బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఆమె 15,000కుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు భవానీపూర్‌ నుంచే సువేందు అధికారి ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement