2.5 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు చూసి | Some political parties develop a fever after India administered record 2. 5 crore vaccines | Sakshi
Sakshi News home page

2.5 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు చూసి

Sep 19 2021 6:13 AM | Updated on Sep 19 2021 7:25 AM

Some political parties develop a fever after India administered record 2. 5 crore vaccines - Sakshi

పనాజీ: దేశవ్యాప్తంగా శుక్రవారం రికార్డు స్థాయిలో 2.5 కోట్లకు పైగా కోవిడ్‌ టీకా డోసులు వేయడంతో తన 71వ పుట్టిన రోజు ఎంతో ఉద్వేగంగా జరిగిందని, మరపురాని రోజుగా నిలిచిందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశాలు కూడా ఇలాంటి అరుదైన ఘనతని సాధించలేకపోయాయని అన్నారు. వ్యాక్సినేషన్‌పై విమర్శలు చేస్తున్న వారిపై ఎదురుదాడికి దిగారు. ఈ డ్రైవ్‌ చూసిన ఒక రాజకీయ పార్టీకి జ్వరం వచ్చిందని ఎగతాళి చేశారు.

శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గోవాలోని ఆరోగ్య కార్యకర్తలు, వ్యాక్సిన్‌ తీసుకున్న వారితో ముచ్చటించారు. అర్హత కలిగిన ప్రతీ ఒక్కరూ సింగిల్‌ డోసు వ్యాక్సిన్‌ తీసుకున్న మొట్టమొదటి రాష్ట్రంగా గోవా నిలిచిన నేపథ్యంలో మోదీ వారితో మాట్లాడారు. ‘నా జీవితంలో ఈసారి జరిగిన పుట్టిన రోజు ఎంతో ప్రత్యేకం. టీకా వేసుకుంటే జ్వరం వస్తుందని  అనుకుంటారు. కానీ నా పుట్టిన రోజున 2.5 కోట్ల టీకా డోసులు ఇవ్వడం చూసి ఒక రాజకీయ పార్టీ జ్వరం వచి్చంది’అని మోదీ పరోక్షంగా కాంగ్రెస్‌కు చురకలంటించారు. ఒకేరోజు ఈ స్థాయిలో టీకాలు ఇవ్వడం చిన్న విషయం కాదని, గంటకి 15 లక్షల డోసులు, ప్రతీ నిముషానికి 26 వేలు, సెకండ్‌కి 415 డోసులు ఇచ్చారని భావోద్వేగంతో చెప్పారు.  

ప్రతిరోజూ పుట్టినరోజు కావాలి: కాంగ్రెస్‌  
ప్రధాని∙మోదీ ప్రతీ రోజూ పుట్టిన రోజు జరుపుకుంటే కొన్ని బీజీపీ పాలిత రాష్ట్రాలు సాధారణ రోజుల కంటే అధికంగా టీకాలు పంపిణీ చేస్తాయని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది. రికార్డు స్థాయిలో 2.5 కోట్ల టీకా డోసులు ఇచ్చామంటూ కేంద్రం జబ్బలు చరుచుకుంటోంది కానీ, జనాభాకి ప్రతీ రోజూ ఇదే స్థాయిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరగాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement