కాంగ్రెస్‌లో శరద్ పవార్‌ పార్టీ విలీనానికి పాజిటివ్‌గా చర్చలు | Sharad Pawar's Party Congress Merger Talks Positive | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో శరద్ పవార్‌ పార్టీ విలీనానికి పాజిటివ్‌గా చర్చలు

Jun 30 2026 9:29 PM | Updated on Jun 30 2026 9:29 PM

 Sharad Pawar's Party Congress Merger Talks Positive

శరద్ పవార్‌(85)కు చెందిన ఎన్‌సీపీ (శరద్‌చంద్ర పవార్) త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో విలీనం అయ్యేందుకు మార్గం సుగమమవుతున్నట్లు తెలుస్తోంది. శరద్ పవార్ పార్టీ, కాంగ్రెస్ విలీన చర్చలు సానుకూలంగా కొనసాగుతున్నాయని, తుది దశకు చేరినట్లు సమాచారం.

ఇందుకు సంబంధించిన వివరాలను కాంగ్రెస్ నాయకుడు విజయ్ వడెట్టివార్ ఓ జాతీయ మీడియాకు తెలిపారు. శరద్ పవార్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయ్యే అవకాశంపై చర్చలు కొనసాగుతున్నాయని ధ్రువీకరించారు. విలీనంపై అధిష్ఠానంతో చర్చలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. "కాంగ్రెస్, శరద్ పవార్ లౌకికవాద సిద్ధాంతాలను విశ్వసించే వారికి మా పార్టీలోకి ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతాం" అని ఆయన చెప్పారు.

శరద్ పవార్ 1999లో కాంగ్రెస్ నుంచి విడిపోయి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)ని స్థాపించారు. 2023లో శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ కూడా అదే విధంగా ఎన్‌సీపీని చీల్చారు. అజిత్ పవార్ తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను తీసుకుని మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ-శివసేన ప్రభుత్వంలో చేరారు. దీంతో ఆ ప్రాంతీయ రాజకీయ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది.

మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే వంటి ప్రాంతీయ నాయకులకు ఇటీవల రాజకీయంగా ఎదురుదెబ్బలు తగిలిన సమయంలో కాంగ్రెస్‌తో విలీనం జరిగే అవకాశంపై చర్చలు మొదలయ్యాయి. ఆయా పార్టీల్లో కీలక నేతలు ఇటీవల ప్రత్యేక వర్గాలను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో సొంత పార్టీల నుంచి దూరమయ్యారు. కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్న ఎన్‌సీపీ (శరద్ చంద్ర పవార్) ఎమ్మెల్యేలు, ఎంపీలకు కాంగ్రెస్ నాయకత్వం ఆమోదం తెలిపిందని కూడా సమాచారం. 

ఎన్డీఏలో చేరదాం 
శరద్ పవార్ పార్టీ భవిష్యత్తుపై రెండు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని సమాచారం. ఒక వర్గం ఎన్‌డీఏలో చేరాలని భావిస్తోంది. పార్టీకి ఉన్న పార్లమెంటు బలం ఆధారంగా ఎన్‌డీఏలో భాగస్వామ్యం లభిస్తుందని ఆ వర్గం వాదిస్తోంది. ప్రతిపక్షంలో ఉండటం వల్ల రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో అభివృద్ధి పనులు, నియోజకవర్గ సమస్యల పరిష్కారం కష్టంగా మారిందని కూడా ఆ వర్గ నాయకులు భావిస్తున్నారని సమాచారం.

పార్టీ రెండు వర్గాలు మళ్లీ కలిస్తే ఎన్‌డీఏలోనే కొనసాగాలని దివంగత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కోరుకున్నారని కూడా సమాచారం. ఆయన మరణం తర్వాత రెండు ఎన్‌సీపీ వర్గాలు మళ్లీ ఒక్కటయ్యే అవకాశం తగ్గిపోయిందని సమాచారం. అయినప్పటికీ స్వతంత్రంగా ఎన్‌డీఏలో చేరేందుకు ఎలాంటి అడ్డంకి ఉండదని ఆ వర్గం భావిస్తోంది. అయితే పార్టీలోని మరో వర్గం కాంగ్రెస్‌లో విలీనం కావాలని కోరుకుంటోందని సమాచారం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement