‘‘గుంట నక్కల్లా వ్యవహరించడం వైఎస్సార్‌సీపీకి తెలియదు’’ | Sajjala Ramakrishna Reddy Slams TDP Government In AP | Sakshi
Sakshi News home page

‘‘గుంట నక్కల్లా వ్యవహరించడం వైఎస్సార్‌సీపీకి తెలియదు’’

Dec 24 2024 12:06 PM | Updated on Dec 24 2024 3:11 PM

Sajjala Ramakrishna Reddy Slams TDP Government In AP

సాక్షి,గుంటూరు:మాజీ ఎంపి నందిగాం సురేష్(Nandigam Suresh) అక్రమ కేసుల్లో అరెస్టై నాలుగు నెలలు అవుతోందని, ఆధారాలు లేకుండా సురేష్‌పై కేసులు పెట్టారని వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishnareddy) అన్నారు. మంగళవారం(డిసెంబర్‌ 24) గుంటూరు జైలులో సురేష్‌ను పరామర్శించిన తర్వాత సజ్జల మీడియాతో మాట్లాడారు.

‘ఈ రోజు టీడీపీ వ్యవహరించినట్లు మేము వ్యవహరించి ఉంటే ఈ కేసులు అప్పుడే తీసేసుకునేవాళ్ళం. మా పాలనలో చట్టం తన పని తాను చేసుకుని వెళ్ళింది. కోర్టుల్లో ఉన్న లొసుగులను ఉపయోగించి జైల్లో ఉంచుతున్నారు. జైల్లో మాజీ ఎంపీకి కనీస సదుపాయాలు కల్పించడం లేదు. వాటర్ బాటిల్ కూడా అనుమతించడం లేదు‌. నేరుగా సీఎం కొడుకే ఫోన్ చేసి సురేష్‌ను ఎలా ఉంచాలి?అనేది చెబుతున్నారు.

.. ఇవన్నీ కూడా మౌనంగానే భరిస్తున్నాం. వైఎస్సార్‌సీపిని లేకుండా చేయాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన మహిళలను అరెస్ట్ చేస్తున్నారు. గతంలో ముప్పై ఏళ్ళ క్రితం నక్సలైట్లను అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టిన వారిని అరెస్ట్ చేస్తున్నారు. వేధించడం అంటే ఎలా ఉండాలో మాకు నేర్పుతున్నారు. ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజల కోసమే ఉపయోగించాలి.

కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకోవడంలో కొత్తకొత్త పద్దతులు ఉపయోగిస్తున్నారు. గుంట నక్కల్లా వ్యవహరించడం వైఎస్సార్‌సీపీకి తెలియదు. మీ కంటే బలంగా కొట్టగలిగే శక్తి వైఎస్సార్‌సీపీకి ఉంది. నాలుగేళ్ళలో మేము అధికారంలోకి వస్తే మా వాళ్ళు చెప్పినా కూడా వినే పరిస్థితి ఉండదు’అని సజ్జల హెచ్చరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement