
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కమిటీ, అన్ని జిల్లాల అధ్యక్షుల ఆత్మీయ సమావేశం జరిగింది. పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి, దివ్యాంగుల విభాగం నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి.. ఆయన ఏమన్నారంటే..
దివ్యాంగులకు సంబంధించిన ప్రతి సమస్యపై వైఎస్ జగన్ క్షుణ్ణంగా తెలుసుకుంటూనే ఉన్నారు. వైఎస్ జగన్ హయాంలో నిస్సహాయులుగా ఉన్న వర్గాలకు, దివ్యాంగులకు సమాన హక్కులు కల్పించడం, అంతిమంగా దివ్యాంగులకు ఎలా లబ్ధిచేయాలని తపించారు. సాంకేతిక కారణాలతో దివ్యాంగులను ఇబ్బంది పెట్టకుండా, నిబంధనలు సరళీకృతం చేయాలని, అవసరమైన సవరణలు చేశారు. క్యాలెండర్ పెట్టుకుని జగనన్న పాలనలో ఏ నెలలో ఏం వస్తుందని సంక్షేమ లబ్ధిదారులకు హక్కుగా లభించేలా చేశారు.
..పాలన అంటే ఒక సార్ధకత దానిని నాడు వైఎస్సార్.. ఆ తర్వాత వైఎస్ జగన్ హయాంలో చూశారు. అసమానతలు తొలగించి రాజ్యాంగ స్పూర్తిని అమలు చేసింది వైఎస్ జగన్ పాలనలోనే. మానవత్వంతో పాలన సాగించడం అనేది చూశాం. వైఎస్సార్సీపీ అనేది ప్రజల్లో నుంచి వచ్చిన పార్టీ కాబట్టి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళుతుంది. వైఎస్ జగన్ పాలనకు పూర్తి వ్యతిరేకంగా చంద్రబాబు పాలన సాగుతుంది. ఏ రకంగా వడపోసి సంక్షేమ పథకాల లబ్ధిదారులను తగ్గించాలనేది చంద్రబాబు లక్ష్యం. చంద్రబాబు సంక్షేమం అంతా తన కోసం, అయిన వారికే తప్ప నిజమైన లబ్ధిదారులకు కాదు. ఎల్లో మీడియా, ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు చంద్రబాబు చేతిలో ఉన్నాయి.
ఊత కర్రల సాయంతో కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. దివ్యాంగుల విషయంలో చంద్రబాబు రాక్షసంగా వ్యవహరిస్తున్నారు. దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సామాజిక భద్రత అనేది లేకపోతే పేద వర్గాలు ఏమవ్వాలి. దివ్యాంగులకు పింఛన్లు అవసరమా అనే చర్చ లేవనెత్తారు చంద్రబాబు. దానికి ఎల్లో మీడియా బాకా ఊదుతోంది. రీవెరిఫికేషన్ పేరుతో దివ్యాంగులను వేధిస్తున్నారు. వికలాంగుల విషయంలో జగన్ ఏనాడు పార్టీలు చూడలేదు. వారికి ఎలా చేయూత ఇవ్వాలి, వారు ఆత్మగౌరవంతో ఎలా బతకాలి అని ఆలోచించారు. వైఎస్ జగన్ పాలన ఈ ఐదేళ్ళు కొనసాగి ఉంటే ఒక కొత్త జనరేషన్ తయారయ్యేది. ఒక మంచి వ్యవస్థలను జగన్ రూపొందిస్తే.. చంద్రబాబు దానిని కుప్పకూల్చారు.
వైఎస్ జగన్ పాలనలో నాడు-నేడు పేరుతో స్కూల్స్ అభివృద్ధి జరిగితే ఇప్పుడు ఏం జరుగుతుంది. కురుపాం, తురకపాలెం ఘటనలే ఇందుకు నిదర్శనం. ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ కాదా.? ప్రభుత్వం దృష్టికి ఇవి రాలేదా..? ఇవి వైఫల్యాలు కావా..? పాలన అనేది ఒక యజ్ఞంలా వైఎస్ జగన్ భావించారు. వైఎస్ జగన్ సంక్షేమ పథకాల డెలివరీ పెడితే చంద్రబాబు లిక్కర్ షాప్లు, బెల్ట్ షాపులు పెట్టి లిక్కర్ డెలివరీ చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థను కూడా రెడ్ బుక్ పేరుతో నాశనం చేశారు. మళ్ళీ అధికారం రాదని తెలిసి చంద్రబాబు ఆయన కుమారుడు బరితెగించి వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఒక బలీయమైన శక్తిగా రూపొందింది. అందుకు ఉదాహరణే జగన్ పర్యటనలకు వస్తున్న లక్షలాది మంది జనమే. కోటి సంతకాల సేకరణలో మీ విభాగం కూడా సమన్వయంతో పనిచేయాలి. మీ పరిధిలో ఉన్నంత మేరకు వైఎస్సార్సీపీ బలోపేతానికి కృషిచేయండి.
కూటమి సర్కార్ దివ్యాంగులను మోసగించింది: మేరుగ నాగార్జున
దేశ చరిత్ర లోనే దివ్యాంగులకు భరోసా, ఆత్మస్ధైర్యం కల్పించింది జగనన్న పాలనలోనే. ఏపీలో కూటమి ప్రభుత్వం దివ్వాంగులను మోసగించింది. వెరిఫికేషన్ పేరుతో దివ్యాంగులను ఆసుపత్రుల చుట్టు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారు. పెన్షన్ల రీవెరిఫికేషన్ పేరుతో వారికి నరకయాతన చూపుతున్నారు. చంద్రబాబు ఇదేనా మానవత్వం. చంద్రబాబు దివ్యాంగుల పట్ల నువ్వు చేస్తున్నది మోసం, దగా కాదా అని ప్రశ్నిస్తున్నాం.
దివ్యాంగులకు ఇచ్చిన హామీ ఏంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి?: పులిపాటి దుర్గారెడ్డి
చంద్రబాబు దివ్యాంగులను నిలువునా మోసం చేశారు. దివ్యాంగుల పెన్షన్లలో కోతలు, ఆంక్షలతో వేధిస్తున్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు నువ్వు దివ్యాంగులకు ఇచ్చిన హామీ ఏంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి. లక్షల మంది దివ్యాంగలకు నోటీసులు ఇచ్చి మా దివ్యాంగులను దొంగలుగా చిత్రీకరిస్తున్నావు. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశావ్. జగన్ హయాంలో తలెత్తుకు తిరిగిన మేమంతా ఇప్పుడు ఆత్మాభిమానం దెబ్బతిని బతుకీడుస్తున్నాం. అనేకమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం మీకు సమంజసమా అని నిలదీస్తున్నాం.