
ఓ డల్లాస్, ఓ ఇస్తాంబుల్ అంటూ తొమ్మిదేళ్ల సంది ప్రచారంతోనే..
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలో మౌలిక సదుపాయాల కల్పనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గత వారం నుంచి వర్షాలు.. వరదలతో నగర ప్రజలు అతలాకుతలం అవుతుంటే ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందన్నారాయన.
తెలంగాణ వర్షాలు.. వరదల విషయంలో సీఎం కేసీఆర్ , మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదు. కేటీఆర్ పుట్టిన రోజు మోజులో ఉండి ప్రజలను మరచిపోయారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కనీసం సమీక్ష చేయడంలేదు. వారం రోజులుగా భారీ వర్షాలతో రాష్ట్రం మొత్తము అల్లకల్లోలంగా మారింది. తీవ్ర వర్షాలతో వాతావరణ శాఖ ఇప్పటికే రాష్ట్రంలో అలెర్ట్ ప్రకటించింది. అయినా ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారాయన.
ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు నానా యాతన పడుతున్నారు. గంటలకొద్దీ రోడ్లపైనే ప్రజలు కష్టాలు పడుతున్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా అభివర్ణించారు. హైదరాబాద్ డల్లాస్, ఓల్డ్ సిటీ ఇస్తాంబుల్ చేస్తామని ప్రగల్బాలు పలికిన కేసీఆర్, కేటీఆర్ హైదరాబాద్ నరక కూపంగా మార్చారని మండిపడ్డారు.
రాష్ట్రంలో వరదలతో భారీ ఆస్తి, ప్రాణ నష్టాలు, పంట నష్టాలు వచ్చాయి. గత 9 ఏళ్లుగా హైదరాబాద్ లో సౌకర్యాల కల్పన, ప్రజలకు మేలు జరిగే ఒక్క చర్య చేపట్టలేదు. బుధ, గురు వారాలలో రెండు రోజులలో ప్రభుత్వం ప్రజలకు సరైన సేవలు అందించి ఆదుకోవాలి. లేకపోతే శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడి ఉంటుందని హెచ్చరించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రేవంత్రెడ్డి పిలుపు ఇచ్చారు. నాలాలు, వరద ప్రాంతాలకు వెళ్లకూడదని, పాత భవనాలు, గోడలు, పాడు బడ్డ ఇళ్ల వద్ద జాగ్రత్త గా ఉండాలి. పిల్లలలను బయటకు పంపవద్దని ప్రజలను కోరారాయన. కాంగ్రెస్ శ్రేణులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందించాలని పిలుపు ఇచ్చారాయన.
ఇదీ చదవండి: సార్.. నన్ను ఎమ్మెల్యేగా గుర్తించండి!