టీడీపీతో పొత్తు జనసేనకు నష్టం..సీట్లు చెరిసగం ఉండాలి:హరిరామజోగయ్య | Harirama Jogaih On Tdp Janasena Coalition | Sakshi
Sakshi News home page

టీడీపీతో పొత్తు జనసేనకు నష్టం..అవినీతి, కులం, రంగా హత్య వంటి నీలినీడలు: హరిరామజోగయ్య

Apr 22 2023 8:43 AM | Updated on Apr 22 2023 2:56 PM

Harirama Jogaih On Tdp Janasena Coalition - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: గత 14 ఏళ్ల టీడీపీ పాలనలో అవినీతి ఆరోపణలు, కుల ముద్ర, రంగా హత్య ఉదంతం వంటి నీలినీడలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయని కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. టీడీపీకి గత 14 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి పథకాలు, మీడియా మద్దతు, చంద్రబాబు అనుభవం వంటి అంశాలు జనసేనకు లాభించినా.. అవినీతి ఆరోపణలు, రంగా హత్య వంటి ఉదంతాలను ప్రజలు మరచిపోలేదని పేర్కొన్నారు.

బాబుకు వయోభారం, లోకేశ్‌కు అనుభవరాహిత్యం, కాపులకు రిజర్వేషన్లు కల్పించడంలో చిత్తశుద్ధి లోపించడం, బీసీలకు జనాభా ప్రాతిపదికపై రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌కు స్పందించకపోవడం, ప్రధాని మోదీకి బాబు బద్ధశత్రువు కావడం వల్ల టీడీపీతో జత కలిస్తే జనసేనకు నష్టం వాటిల్లుతుందని స్పష్టం చేశారు. ఒకవేళ టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే సీట్ల సర్దుబాటులో చెరిసగంగా ఉండాలని తెలిపారు. లేకుంటే అసంతృప్తివాదులు పెరిగి ఓటింగ్‌ సమయంలో ఓట్లు చీలిపోయి మధ్యలో వైఎస్సార్‌సీపీ లబ్ధి పొందుతుందని పేర్కొన్నారు.

టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకొస్తే ముఖ్యమంత్రి పదవి పూర్తికాలం చంద్రబాబుకు కట్టబెడితే.. బాబు వద్ద పవన్‌ ప్యాకేజీ తీసుకున్నాడని, కాపు కులాన్ని టీడీపీకి తాకట్టు పెట్టాడంటూ వైఎస్సార్‌సీపీ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతుందని స్పష్టం చేశారు. అధికారం ఇద్దరూ చెరిసగం తీసుకోవాలని తెలిపారు.
చదవండి: ఎస్‌.. వైనాట్‌ 175.. ఏపీలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌ 

Advertisement
 
Advertisement
Advertisement