
సాక్షి, గజ్వేల్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పేదలను, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ నాయకులకు ఇష్టారాజ్యంగా రైతులపై దాడులు చేస్తున్నారని ఆరోపణలు చేశారు.
కాగా, కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యంతో సిద్దిపేట జిల్లాలో భూమి కోల్పోయిన కిష్టయ్య అనే రైతు ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రాణాపాయ స్థితిలో గజ్వేల్ ఆర్వీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కిష్టయ్య, ఆయన కుటుంబాన్ని ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు. అనంతరం, హరీష్ రావు మాట్లాడుతూ..‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పేద ప్రజలను, రైతులను తీవ్రంగా ఇబ్బందులు పెడుతోంది. కాంగ్రెస్ నాయకులు ఇష్టారాజ్యంగా పేదరైతుల భూముల మీద దాడులు చేస్తున్నారు. రైతులపై విపరీతమైన అక్రమాలు, దౌర్జన్యాలు రాష్ట్రవ్యాప్తంగా పెరిగిపోయాయి.
ఇలాంటి ఒక సంఘటనే సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దమ్మక్కపల్లి గ్రామంలో కూడా జరిగింది. బండి కిష్టయ్య అనే పేద రైతు తన భూమి హద్దులు చూపించాలని సర్వే కోసం అప్లై చేస్తే అక్కడికి వచ్చిన డీఐ సర్వే చేసి సరిహద్దులు పెట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకులు అందరి ముందే సదరు అధికారికి ఫోన్ చేసి వారిపై ఒత్తిడి తెచ్చి రెండోసారి సర్వే చేయించారు. రెండోసారి సర్వే చేస్తే హద్దులన్నీ మార్చేసి ఆ రైతు పొలానికి దారి లేకుండా చేశారు. రైతును తీవ్ర ఇబ్బందులు పెట్టారు.
ఈ క్రమంలోనే రైతు నుంచి 20 లక్షల రూపాయలు కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్లో రైతుపై కేసు పెట్టి వేధించి భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో, ఆందోళనకు గురైన కిష్టయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రైతు కుటుంబంతో మాట్లాడినప్పుడు వారిని 20 లక్షల రూపాయలు అడిగారని చెప్తున్నారు. కాంగ్రెస్ పెద్దల అండదండలు మాకు ఉన్నాయని, మీరు ఎక్కడికి వెళ్లినా మీకు న్యాయం జరగదు అని బెదిరించారని చెప్పుకొచ్చారు.
కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుల దౌర్జన్యం, విపరీత చర్యల వల్ల అధికారులపై ఒత్తిడి తెచ్చి రైతు భూమి హద్దులు మార్చడం వల్ల కిష్టయ్య ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడటం జరిగింది. అడిషనల్ కలెక్టర్ స్థాయిలో విచారణ జరిపించాలని హద్దులు మార్చిన డీఐపై చర్యలు తీసుకోవాలి. అలాగే, అధికారులపై ఒత్తిడి తెచ్చిన కాంగ్రెస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ ఈ ఘటనపై దృష్టి పెట్టాలని, ఇలాంటి దురదృష్టకర ఘటనలు రాష్ట్రంలో జరగకుండా చూడాలని, కిష్టయ్యకు నష్టపరిహారాన్ని ఇవ్వాలని కోరుతున్నాం. పేద రైతులకు అన్యాయం జరగకుండా చూడాలి. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి రైతు భూమిని వారికి దక్కే విధంగా రెవెన్యూ శాఖ మంత్రి, ముఖ్య మంత్రి చర్యలు తీసుకోవాలి’ అని కామెంట్స్ చేశారు.