5 వేల కోట్ల డ్రగ్స్‌ రాకెట్‌.. కాంగ్రెస్‌పై అమిత్‌ షా ధ్వజం | Congress wants to take youth to dark world of drugs: Amit Shah | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ యువతను చీకటి ప్రపంచంలోకి నెడుతోంది: అమిత్‌ షా

Oct 4 2024 2:36 PM | Updated on Oct 4 2024 4:30 PM

Congress wants to take youth to dark world of drugs: Amit Shah

న్యూఢిల్లీ: ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలోనే పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఏకంగా రూ.5 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. దీనిపై కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షా  స్పందిస్తూ.. దేశంలోని యువతను డ్రగ్స్‌తో నిండిన చీకటి ప్రపంచంలోకి కాంగ్రెస్‌ నడిపిస్తోందని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ ప్రభుత్వం డ్రగ్స్‌పై ‘జీరో టాలరెన్స్’ విధానానికి కట్టుబడి ఉందని తెలిపారు.  

యువతను విద్య, క్రీడలు ఆవిష్కరణల వైపు నడిపించేందుకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుంటే.. కాంగ్రెస్ తన రాజకీయ పరపతిని ఉపయోగించుకొని మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తోందని మండిపడ్డారు.  ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘మాదక ద్రవ్య రహిత భారత్’ కోసం మోదీ ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తున్న వేళ.. ఢిల్లో స్వాధీనం చేసుకున్న రూ. 5,600 కోట్ల మాదక ద్రవ్యాల కేసులో ప్రముఖ కాంగ్రెస్ నేత ప్రమేయం ఉండటం అత్యంత ప్రమాదకరం. సిగ్గుచేటు’ అని షా పేర్కొన్నారు.

కాంగ్రెస్ హయాంలో పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో యువతపై డ్రగ్స్ ప్రభావం చూపిందని విమర్శించారు.యువతను మళ్లీ డ్రగ్స్‌ ప్రపంచంలోకి లాగేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అదే మోదీ ప్రభుత్వం యువతను క్రీడలు, విద్య, ఆవిష్కరణల వైపు మళ్లించేందుకు కృషి చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ నేతలు తమ రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించి యువతను డ్రగ్స్ ఊబిలోకి నెట్టడం దారుణమన్నారు. దీనిని మోదీ ప్రభుత్వం ఎప్పటికీ జరగనివ్వదని, రాజకీయాలతో సంబంధం లేకుండా డ్రగ్స్ నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని షా అన్నారు.

అయితే తుషార్ గోయల్‌తో ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ ఖండించింది. అయినప్పటికీ ఆయన గతంలో 2022 వరకు ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్‌కు ఆర్టీఐ సెల్ చైర్మన్‌గా పనిచేశాడనిఅధికారుల విచారణలో అంగీకరించాడు. సోషల్‌ మీడియాలో డిక్కీ గోయల్‌ పేరుతో అతడు లోక్‌సభ ఎంపీ దీపేందర్‌ సింగ్‌ హుడా, హర్యానా కాంగ్రెస్‌ చీఫ్‌ ఉదయ్‌ భాన్‌తోతో సహా పలువురు ప్రముఖ కాంగ్రెస్‌ నేతలతో దిగిన ఫోటోలను పోస్టు చేసినట్లు అధికారులు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement