Telangana: నెలాఖరుకు కాంగ్రెస్‌ జాబితా? | Congress list at the end of September | Sakshi
Sakshi News home page

Telangana: నెలాఖరుకు కాంగ్రెస్‌ జాబితా?

Sep 20 2023 3:42 AM | Updated on Sep 20 2023 10:48 AM

Congress list at the end of September - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ స్క్రీనింగ్‌ కమిటీ మరోమారు భేటీ కానుంది. ఢిల్లీ వేదికగా బుధ, గురువారాల్లో ఈ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం జర గనుంది. రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థు లను ఖరారు చేయడంలో భాగంగా దరఖాస్తులను వడపోసి షార్ట్‌ లిస్ట్‌ తయారు చేయడమే ఎజెండాగా ఈ సమావేశాలు జరగనున్నాయి.

స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ మురళీధరన్‌ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పీసీసీ నుంచి రేవంత్‌రెడ్డి, భట్టి విక్ర మార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరు కానున్నారు. ఇందులో ఉత్తమ్, రేవంత్‌లు పార్లమెంటు సమావే శాల్లో పాల్గొనేందుకు ఢిల్లీలోనే ఉండగా, భట్టి మంగళవారం ఉదయం ఢిల్లీ వెళ్లారు. వీరితో పాటు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఠాక్రే, ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శులు విష్ణునాథ్, రోహిత్‌చౌదరి, మన్సూర్‌ అలీ ఖాన్‌ కూడా స్క్రీనింగ్‌ కమిటీ భేటికి హాజరవుతారు.

ఇటీవలే హైదరాబాద్‌ వేదికగా సమావేశ మైన స్క్రీనింగ్‌ కమిటీ ఏమీ తేల్చకుండానే సమా వేశాన్ని వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో బుధ, గురువారాల్లో జరిగే మలిదశ భేటీల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన షార్ట్‌లిస్ట్‌ రెడీ కానుంది. అనంతరం ఈ జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)కి పంపుతారని, ఈ కమిటీ భేటీ అనంతరం ఈ నెలాఖరున లేదంటే అక్టోబర్‌ మొదటి వారంలో తొలి జాబితాను విడుదల చేస్తారని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement