మిగతా స్థానాలు 20 తర్వాతేనా?  | Congress clears four names from Telangana for Parliament elections | Sakshi
Sakshi News home page

మిగతా స్థానాలు 20 తర్వాతేనా? 

Mar 9 2024 4:45 AM | Updated on Mar 9 2024 8:00 AM

Congress clears four names from Telangana for Parliament elections - Sakshi

నాలుగు లోక్‌సభ స్థానాలకే అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌ 

సీఈసీ తదుపరి భేటీలో ‘తెలంగాణ’పై చర్చకు నో చాన్స్‌ 

20వ తేదీ తర్వాత జరిగే సమావేశంలోనే మిగతా అభ్యర్థుల ఖరారు

చేవెళ్ల సీటు దాదాపు సునీతా మహేందర్‌రెడ్డికే ఖరారు! 

సాక్షి, హైదరాబాద్‌: ఇప్పటికి నాలుగు లోక్‌సభ స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించిన ఏఐసీసీ, తెలంగాణలోని మిగిలిన స్థానాలకు ఈ నెల 20వ తేదీ తర్వాతే లైన్‌క్లియర్‌ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈనెల 11 లేదా 14, 15 తేదీల్లో మరోమారు కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీ జరిగే అవకాశమున్నా ఆ భేటీలో తెలంగాణ అభ్యర్థులపై చర్చ ఉండకపోవచ్చని సమాచారం.

తదుపరి భేటీలో తెలంగాణలోని మిగిలిన అభ్యర్థిత్వాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని, ఈ భేటీ ఈ నెల 20 తర్వాత జరిగే అవకాశముందని గాంధీభవన్‌ వర్గాలంటున్నాయి. ఇటీవల జరిగిన సీఈసీ భేటీ ఎజెండాలో రాష్ట్రం నుంచి 9 పార్లమెంటు స్థానాలపై నిర్ణయం తీసుకునే అంశం ఉన్నప్పటికీ, కేవలం ఐదింటిపైనే చర్చించారని తెలిసింది. కానీ అనూహ్యంగా నాలుగింటిని మాత్రమే ఏఐసీసీ ప్రకటించింది. చేవెళ్ల నుంచి సునీతా మహేందర్‌రెడ్డి అభ్యర్థిత్వం కూడా ఖరారైందని, మలి జాబితాలో ఆమె పేరు ప్రకటిస్తారని తెలుస్తోంది. 

ఒకటి రిజర్వుడ్, మూడు జనరల్‌ 
తాజాగా ప్రకటించిన నాలుగు స్థానాల్లో ఒకటి రిజర్వుడ్‌ కాగా, మూడు జనరల్‌ స్థానాలు. ఇందులో మహబూబాబాద్‌ (ఎస్టీ) నుంచి పాతకాపు పోరిక బలరాం నాయక్‌కే మరోమారు అవకాశమిచ్చారు. ఇక్కడ టికెట్‌ కోసం విజయాబాయి, బెల్లయ్య నాయక్‌లు శతవిధాలా ప్రయత్నించినా హైకమాండ్‌ బలరాం నాయక్‌వైపే మొగ్గుచూపింది. ఇక మహబూబ్‌నగర్‌లో అందరూ ఊహించినట్టుగానే వంశీచంద్‌రెడ్డి పేరు ఖరారయింది.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుదిరిన ఒప్పందం మేరకు జహీరాబాద్‌ స్థానాన్ని బీసీ నేత సురేశ్‌ షెట్కార్‌కు కేటాయించారు. మరోవైపు నల్లగొండలో సీనియర్‌ నేత జానారెడ్డి మరోమారు తన పట్టు నిలుపుకున్నారు. ఈ స్థానం విషయంలో చాలా ఊహాగానాలు వచి్చనప్పటికీ తన కుమారుడు రఘువీర్‌కు టికెట్‌ ఇప్పించుకోవడంలో జానా సఫలీకృతులు కావడం గమనార్హం. ఇక, నాలుగు ప్రకటిత స్థానాల్లో రెండు రెడ్డి సామాజిక వర్గానికి, ఒకటి బీసీకి, మరొకటి ఎస్టీకి కేటాయించారు.

Advertisement
 
Advertisement
Advertisement