సీఎం చన్నీ సోదరుడికి కాంగ్రెస్‌ టికెట్‌ నిరాకరణ | CM Charanjit Singh Channi Brother Denied Congress Ticket Punjab | Sakshi
Sakshi News home page

సీఎం చన్నీ సోదరుడికి కాంగ్రెస్‌ టికెట్‌ నిరాకరణ

Jan 17 2022 2:30 PM | Updated on Jan 17 2022 4:41 PM

CM Charanjit Singh Channi Brother Denied Congress Ticket Punjab - Sakshi

బస్సీ పఠానా(ఎస్‌సీ) స్థానం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేయాలని ఆయన నిర్ణయించుకున్నారు.

న్యూఢిల్లీ: పార్టీ తరఫున పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్‌ పార్టీ విడుదలచేసింది. 86 మంది పేర్లున్న ఈ జాబితాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ సోదరుడు మనోహర్‌ సింగ్‌కు స్థానం దక్కలేదు. దీంతో బస్సీ పఠానా(ఎస్‌సీ) స్థానం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేయాలని ఆయన నిర్ణయించుకున్నారు.

చదవండి: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 20కి వాయిదా

మనోహర్‌ వృత్తిరీత్యా వైద్యుడు. గత ఏడాది ఆగస్ట్‌లో ప్రభుత్వం ఉద్యోగానికి రాజీనామా చేశాక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కాగా, చంకౌర్‌ సాహిబ్‌ స్థానం నుంచి సీఎం చన్నీ బరిలో నిలుస్తున్నారు. నవ్‌జోత్‌ సింగ్‌ సిద్ధూ అమృతసర్‌(తూర్పు) నుంచి పోటీచేయనున్నారు.

నలుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌ టికెట్లు నిరాకరించింది. నటుడు సోనూసూద్‌ సోదరి మాళవిక మోగా నుం చి పోటీచేస్తారు. దీంతో మోగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే హర్‌జోత్‌ కమల్‌ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. 

ఆరు రోజులు వాయిదా వేయండి
చండీగఢ్‌: గురు రవిదాస్‌ జీ జయంతి(ఫిబ్రవరి 16న) వస్తున్న నేపథ్యంలో పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ను ఆరు రోజులు వాయిదావేయాలని బీజేపీ, దాని మిత్రపక్షాలు పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌(పీఎల్‌సీ), శిరోమణి అకాలీదళ్‌(సంయుక్త్‌)లు ఈసీని ఆదివారం కోరాయి. ఈ మేరకు ఈసీకి లేఖ రాశాయి. బీఎస్‌పీ, కాంగ్రెస్‌ నేత, రాష్ట్ర సీఎం చన్నీలు సైతం పోలింగ్‌ను ఆరు రోజులు వాయిదా వేయాలని కోరడం తెల్సిందే. ఫిబ్రవరి 14కు బదులు పోలింగ్‌ను 20న నిర్వహించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement