వైద్య కోర్సుల్లో రిజర్వేషన్లు ఖరారు చేసిన కేంద్రం | Centre approves reservation for OBC EWS in all India quota for medical courses | Sakshi
Sakshi News home page

వైద్య కోర్సుల్లో రిజర్వేషన్లు ఖరారు చేసిన కేంద్రం

Jul 29 2021 4:26 PM | Updated on Jul 29 2021 6:33 PM

Centre approves reservation for OBC EWS in all India quota for medical courses - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: వైద్య విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం 2021-22కి గాను వైద్య కోర్సుల్లో రిజర్వేషన్లను కేంద్రం ఖరారు చేసింది. మెడికల్ అండ్ డెంటల్ ఎడ్యుకేషన్ (యూజీ, పీజీ) లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రిజర్వేషన్లను కల్పిస్తున్నట్లు  వెల్లడించింది. ఆల్ ఇండియా కోటా కింద ఓబీసీ విద్యార్ధులకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్ విద్యార్ధులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం గురువారం నిర్ణయించింది.

కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో దాదాపు 5,550 మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని, ఓబీసీలకు, ఈడబ్ల్యుఎస్ విద్యార్థులకు రిజర్వేషన్లను కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఏడాది నుంచి ఆర్థికంగా వెనకబడిన వారికి విద్యా రిజర్వేషన్లను కల్పిస్తున్నట్టు  పేర్కొంది.  దీంతో ప్రతి సంవత్సరం ఎంబీబీఎస్‌లో దాదాపు 1500 మంది ఓబిసి విద్యార్థులకు, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో  2500 మంది ఓబిసి విద్యార్థులకు, ఎంబీబీఎస్‌లో 550 మంది ఈడబ్ల్యుఎస్ విద్యార్థులకు, పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌లో 1000 మంది ఈడబ్ల్యుఎస్ విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని వెల్లడించింది.

తమ ప్రభుత్వం మైలురాయిలాంటి నిర్ణయం తీసుకుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్‌ చేశారు. తద్వారా ప్రతి సంవత్సరం వేలాదిమంది యువత అవకాశాలు  పొంద నున్నారని పేర్కొన్నారు, మన దేశంలో సామాజిక న్యాయకల్పనలో ఇదొక కొత్త అధ్యాయంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యకు సమర్థవంతమైన పరిష్కారం కల్పించాలని ప్రధాని మోదీ  జూలై 26న సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలను ఆదేశించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement