‘కాషాయం జెండా.. మనదే శివసేన’ | Aditya thackeray Ready To Visit Main Places Of Maharashtra | Sakshi
Sakshi News home page

‘కాషాయం జెండా.. మనదే శివసేన’

Jul 21 2022 2:31 PM | Updated on Jul 21 2022 2:42 PM

Aditya thackeray Ready To Visit Main Places Of Maharashtra - Sakshi

సాక్షి, ముంబై: ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గంలో రోజురోజుకూ పెరిగిపోతున్న పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు యువ నేత ఆదిత్య ఠాక్రే నడుం బిగించారు. ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేనతో తెగతెంపులు చేసుకుని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే వర్గంలోకి చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో చీలికలను అరికట్టేందుకు మూడు రోజులపాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాలైన భివండీ, నాసిక్, దిండోరీ, సంభాజీనగర్, షిర్డీ తదితర ప్రాంతాల్లో ఆదిత్య ఠాక్రే పర్యటించనున్నారు. ఆ తరువాత రెండో దశ పర్యటనలో మరికొన్ని నగరాలు, పట్టణాలను ఎంచుకోనున్నారు. అందుకు సంబం«ధించిన ప్రణాళికలు పార్టీ వర్గాలు రూపొందిస్తున్నాయి.  

ఈ సందర్భంగా ఆదిత్య ఠాక్రే ‘మన భగ్‌వా (కాశాయం జెండా)–మనదే శివసేన’ అనే నినాదంతో ప్రధాన నగరాలు, పట్టణాలను పర్యటిస్తూ ప్రజలతో సంప్రదింపులు జరుపనున్నారు. అదేవిధంగా నియోజక వర్గాలలోని శివసేన ప్రతిని«ధులు, పదాధికారులు, కార్యకర్తలతో చర్చిస్తారు. శిందే వర్గంలో చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. శిండే వర్గంలో చేరికల వల్ల శివసేన రోజురోజుకూ బలహీన పడుతోంది. పదాధికారులు, కార్యకర్తలు మనోస్ధైర్యాన్ని కోల్పుతున్నారు. చీలికలను నియంత్రించేందుకు శివసేన పార్టీ ప్ర«ధాన కార్యాలయమైన సేనా భవన్‌లో ఉద్ధవ్‌ ఠాక్రే తరచూ సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. అయినప్పటికీ పార్టీ నుంచి బయటపడే వారి సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు.

దీంతో తండ్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై పడుతున్న అదనపు భారాన్ని కొంతమేర తన భుజస్కందాలపై వేసుకోవాలని ఆదిత్య భావించారు. అందులో భాగంగా ఇటీవల నెలకొన్న తాజా పరిణామాలతో ఆత్మస్ధైర్యం కోల్పోయిన శివసైనికులను ఓదార్చడం, వారికి మనోధైర్యాన్ని నూరిపోసేందుకు యువనేత నడుం బిగించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా తిరుగుబాటు చేసిన ఏక్‌నాథ్‌ శిందే, ఆయన శిబిరంలో చేరిన మాజీ, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లపై తీవ్ర విమర్శలు గుప్పించనున్నారు. వీరంతా శివసేనను మోసగించిన తీరును ప్రజల ముందు ఎండగట్టనున్నారు. బలహీనపడుతున్న శివసేనను తిరిగి పటిష్టం చేయడానికి తనవంతుగా ప్రయత్నం చేయనున్నారు. బాల్‌ ఠాక్రే బతికుండగా శివసేన పార్టీ గర్జించే సింహం లాగా కనిపించేదని, ఇప్పుడు అదేవిధంగా శివసేన పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకువస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement