సాక్షి పెద్దపల్లి:
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) కార్యక్రమం జిల్లాలో గురువారం అధికారికంగా ప్రారంభమైంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బూత్స్థాయి అధికారులు(బీఎల్వోలు) ఇంటింటీకి వెళ్లి ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ ప్రక్రి య చేపట్టారు. వచ్చేనెల 24వ తేదీ వరకు ఈ ప్ర క్రియ చేపట్టనున్నారు. తొలిరోజు బూత్స్థాయి అధికారులు ఇంటింటీకి వెళ్లి 7,412 ఎన్యూమరేషన్ ఫామ్స్ను ఓటర్లకు అందజేసి కార్యక్రమానికి శ్రీకా రం చుట్టారు. వివరాలు నింపిన తర్వాత కొద్దిరోజుల వ్యవధిలో వాటిని తిరిగి బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి స్వీకరిస్తారు.
844 మంది బీఎల్వోల నియామకం
జిల్లాలోని 7,11,408 మంది ఓటర్ల ఇళ్లకు ఈ ఫామ్స్ను సకాలంలో చేరవేయడానికి ఎన్నికల యంత్రాంగం జిల్లాలో 844మంది బీఎల్వోలను నియమించింది. పోలింగ్ కేంద్రాల వారీగా కేటాయించిన ఇళ్లకు బీఎల్వోలు స్వయంగా వెళ్తున్నారు. వీరితోపాటు గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) కూడా కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు.
రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకారం
సవరణ ప్రక్రియలో పారదర్శకత, విశ్వసనీయతను పెంపొందించేందుకు గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏ లు) కూడా బీఎల్వోలతో కలిసి పర్యటిస్తున్నారు. పోలింగ్ స్టేషన్ పరిధిలో ప్రతీపార్టీ తరఫున ఒక ప్రతినిధి పాల్గొంటూ, ఫామ్స్ పంపిణీ, వివరాల ధ్రువీకరణ, ఓటర్లకు అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తున్నారు.
డిజిటల్ విధానానికీ స్పందన
సంప్రదాయ పద్ధతితోపాటు డిజిటల్ విధానంలో కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్ సమర్పించే అవకా శం కల్పించారు. తొలిరోజే జిల్లావ్యాప్తంగా 142 మంది ఓటర్లు ఆన్లైన్ ద్వారా తమ వివరాలను నమోదు చేశారు. ఇది పంపిణీ చేసిన ఫామ్స్తో పోల్చితే 1.92 శాతంగా నమోదైంది.
అవగాహన కల్పించడమే సవాల్
ప్రతీఓటరు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫామ్–2ను పూర్తిచేసి బీఎల్వోలకు అందజేయాల్సి ఉండటంతో క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలకు ప్రాధాన్యం ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ప్రారంభమవడంతో చాలామంది రైతులు ఉదయం వేళలకే పొలాలకు వెళ్లిపోతుండడం బీఎల్వోలకు సవాల్గా మారింది. పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలతో బిజీగా ఉండే ఓటర్లను కలవడం కూడా సులభం కావడం లేదు. అయితే ఎన్నికల అధికారులు, బీఎల్వోలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ ఓటర్లకు అవగాహన కల్పిస్తే ఈ ప్రక్రియ విజయవంతమవుతుందని అధికారులు భావిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటుహక్కు భద్రంగా ఉండాలంటే ఓటర్లు సకాలంలో ఫామ్స్ పూర్తిచేసి సమర్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రారంభమైన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ
ఇంటింటికి బీఎల్వోలు.. పర్యవేక్షించిన అధికారులు
తొలిరోజు 7,412 ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ
ప్రక్రియలో రాజకీయ పార్టీల ప్రతినిధుల భాగస్వామ్యం
జిల్లాలో సర్ వివరాలు
బీఎల్వోలు : 845
ఓటర్లు : 7,11,408
ప్రింట్చేసిన ఎన్యుమరేషన్ ఫామ్స్ 7,06,107
ఓటర్లకు పంపిణీ చేసినవి :7,412
ఫామ్స్ పంపిణీ చేసిన శాతం : 1.04
డిజిటల్లో ఫామ్స్ నింపినవారు :142
డిజిటల్లో ఫామ్స్ నింపిన వారిశాతం : 1.92


