మంథనిలో ప్రతీ సీజన్లో ఇదే దుస్థితి రూ.6కోట్లు వెచ్చించినా నీటిపాలే.. ఆధునికీకరించినా అన్నదాతకు అవస్థలే.. కాలువలు అధ్వానం.. కొట్టుకుపోతున్న ధాన్యం
నష్టం జరగకుండా చర్యలు
ముంచుతున్న
మంథని: అకాల వర్షాలు అన్నదాతను ఒకవైపు తరముతూ ఉంటే.. అస్తవ్యస్తమైన మంథని వ్యవసాయ మార్కెట్ వరదనీటితో నిండా ముంచుతోంది. యార్డులో సిమెంట్ ప్లాట్ఫారాలు, చుట్టూ ప్రహరీ ఉండడంతో ధాన్యానికి రక్షణ ఉంటుందనే భరోసాతో రైతులు యార్డులో ధాన్యం ఆరబోస్తున్నారు. కానీ, ప్రతీసారి అకాల వర్షాలు వారి కళ్ల ముందే పంటలను తన్నుకుపోతుంటే కన్నీరు పెట్టుకోవడం తప్ప చేసేదేమీ ఉండడంలేదు.
రూ.6 కోట్లతో ఆధునికీకరించినా అవస్థలే
వ్యవసాయ మార్కెట్ యార్డును రూ.6 కోట్లకుపైగా వెచ్చించి ఆధునికీకరించారు. 2012లో దాదాపు రూ.4 కోట్ల 56 లక్షలతో 600 మెట్రిక్ ట న్నుల గోదాం, కవర్షెడ్, అంతర్గత రోడ్లు, సిమెంట్ యార్డు, రైతు విశ్రాంతి భవనం, 60 వేల లీటర్ల నిల్వసామర్థ్యం గల వాటర్ ట్యాంకు, యార్డులో విద్యుదీకరణ పనులు చేపట్టారు. 2016లోనూ రూ.30 లక్షల వ్యయంతో డ్రైనేజీ నిర్మించారు. మార్కెట్ యార్డు చుట్టూ ప్రహరీ, ఎదుట రైతువిగ్రహం, కమాన్.. ఇలా సుమారు రూ.6కోట్లు వెచ్చించి అనేక సౌకర్యాలు కల్పించారు.
మరో రూ.2 కోట్లతో ప్రతిపాదనలు
గతంలో చేపట్టిన పనులు సక్రమంగా లేకపోవడంతో మరమ్మతులు, కొత్త నిర్మాణాల కోసం మరో రూ.2 కోట్లతో ఇటీవల ప్రతిపాదనలు రూ పొందించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు, ఒకగది, దాని ఎదుట షెటర్ల నిర్మాణం ఇందులో ఉన్నా.. ప్రతిపాదనలు పెండింగ్లో ఉండడం కలవరం రేపుతోంది.
రూ.కోట్లు వెచ్చించి మార్కెట్ యార్డును ఆధునికీకరించినా.. వర్షపునీరు బయట వెళ్లే మార్గం సరిగ్గా లేదు. దీంతోనే ఏటా ప్రతీసీజన్లో అకాలవర్షంతో వచ్చే వరద ఎక్కడికక్కడే నిలుస్తోంది. ఆరబోసిన, నిల్వచేసిన, తూకం వేయడానికి సిద్ధంగా ఉంచిన ధాన్యం, ఇతర పంట ఉత్పత్తలను వరద తన్నుకుపోతోంది. అన్నదాతలకు అపార నష్టం తెచ్చిపెడుతోంది. కేవలం ప్రణాళిక బద్ధంగా నిర్మాణా చేపట్టకపోవడమే ఇందుకు కారణమని, తద్వారా రైతులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని విమర్శలు ఉన్నాయి. ఓ మోస్తారు వర్షానికే నీరుచేరి ధాన్యం తడిసి ముద్దకావడం, వదరలో కొట్టుకుపోవడం ద్వారా రైతులకు నష్టం వాటిల్లుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. మొన్నటికి మొన్న కురిసిన అకాల వర్షానికి టన్నుల కొద్దీ ధాన్యం నీట మునిగింది. మరికొంత సమీపంలోని డ్రైనేజీలోకి కొట్టుకుపోయింది.
మార్కెట్లో డ్రైనేజీ వ్యవస్థతోనే వడ్లు తడుస్తున్నాయి. మరమ్మతులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అభివృద్ధి పనులకు ప్రతిపాదించాం. మంత్రి శ్రీధర్బాబు సహకారంతో త్వరలోనే అనుమతులు వస్తాయి.
– కుడుదుల వెంకన్న, చైర్మన్, ఏఎంసీ, మంథని


