పెద్దపల్లిరూరల్/పెద్దపల్లి: జనగణన గృహ జాబితా ప్రక్రియను పకడ్బందీగా, సమగ్ర ప్రణాళికతో చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. పెద్దకల్వలలో చేపట్టిన జనగణన తీరు సోమవారం ఆ యన పరిశీలించి పలు సూచనలు చేశారు. జూన్ 9వ తేదీ వరకు ఈప్రక్రియ నిర్వహిస్తామన్నారు. నీటి కనెక్షన్, వ్యక్తిగత మరుగుదొడ్డి, ఫోన్, ఇంటర్నెట్, ఆహారపు అలవాట్లు లాంటి 33 ప్రశ్నల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారని అన్నారు.
300 ఇళ్లు.. 800 జనాభాకో ‘బ్లాక్’
జనగణన సర్వే నిర్వహణకు ఇంటింటికీ వెళ్లి ఎన్యు మరేటర్లు వివరాలను సేకరిస్తారని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. 300 ఇళ్లు, 800 జనాభాకో బ్లాక్గా ఏర్పాటు చేసినట్టు వివరించారు. జిల్లావ్యాప్తంగా 1,548 హౌసింగ్ లిస్ట్ బ్లాకులు గుర్తించినట్టు పేర్కొన్నారు. ఎన్యుమరేటర్లు క్యూఆర్కోడ్ ఉన్న ఐడీకార్డులు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లోని గోదామును కలెక్టర్ తనిఖీ చేశారు. తహసీల్దార్ రాజయ్య తదితరులు ఉన్నారు.
వందశాతం రైతురిజిస్ట్రీ నమోదు
పెద్దపల్లి: జిల్లా వ్యవసాయాధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ, రైతు రిజిస్ట్రీని 100 శాతం పూర్తిచేయాలన్నారు. ముఖ్యంగా కాల్వశ్రీరాంపూర్, పెద్దపల్లి మండలాల్లో 70 శాతానికి పరిమితమైందని తెలిపారు. పెండింగ్ రైతుబీమా దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని చెప్పారు. వచ్చే సీజన్లో యూరియా కొరత తలెత్తకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల వేగాన్ని వెంటనే పెంచాలని అన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బ్యాంకు లింకేజీలో రాష్ట్రంలోనే అగ్రస్థానం
స్వశక్తి సంఘాల బ్యాంకు లింకేజిల్లో జిల్లా రాష్ట్రస్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. 2025–26కిగాను 7,716 స్వయం సహాయక సంఘాలకు రూ.477. 86 కోట్ల నిర్దేశిత లక్ష్యానికి 6,851 స్వశక్తి సంఘాల కు రూ.454.66 కోట్లు సాధించి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. డీఆర్డీవో కాళిందిని తదితరులను అభినందించారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు


