రామగుండం నగరంలో 13 వాటర్ ట్యాంకుల నిర్వహణపై పర్యవేక్షణ కరువైంది. ఎప్పుడు శుభ్రం చేశారో, మళ్లీ ఎప్పుడు చేయాలనే వివరాలే లేవు. కనీసం మూడునెలలకోసారైనా వాటిని శుభ్రం చే యించాలి. ఇది అమలుకు నోచుకోవడంలేదు. సమయానికి శుభ్రం చేయకపోతే నీరు కలుషితమై ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
గతేడాది వేసవిలో రూ.45 లక్షల వ్యయంతో గోదావరిఖని సాధన నగర్, రామగుండం హౌసింగ్ బోర్డు కాలనీలో అంతర్గత తాగునీటి పైపులైన్ల నిర్మాణం చేపట్టారు. వీటిని మెయిన్ పైపులైన్కు ఇంకా కనెక్ట్ చేయలేదు. ఏడాది గడిచినా అధికారులు పట్టించుకోవడంలేదు. వందలాది కుటుంబాలు తాగునీటి కోసం తపిస్తున్నాయి.
రామగుండం కార్పొరేషన్లో పైప్లైన్ లీకేజీలను రోజుల తరబడి అరికట్టడంలేదు. లక్షల లీటర్ల తాగునీరు రోడ్లపై వృథాగా పోతోంది. లీకేజీలతో మురుగునీరు కలిసే ప్రమాదం ఉందని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. గతంలో మరమ్మతు చేసిన ప్రాంతాల్లోనే మళ్లీ లీకేజీలు ఏర్పడడం అధికారుల పనితీరును విమర్శల పాలుచేస్తోంది.


