ఎలిగేడు: పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామానికి చెందిన యాళ్ల మల్లారెడ్డి(52) వడదెబ్బతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మల్లారెడ్డి ఇటీవల ఇల్లు నిర్మించుకున్నాడు. ఈనెల 26న గృహప్రవేశం జరిగింది. ఇందుకోసం ఆయన వివిధ పనులు, ఏర్పాట్లపై ఎండలో తిరిగాడు. ఈక్రమంలో అస్వస్థకు గురయ్యాడు. బుధవారం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య లత, కూతురు, కుమారుడు ఉన్నారు.
తాటిచెట్టు పైనుంచి పడి..
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని కూచిరాజ్పల్లి మద్దికుంట తాళ్లలో గంగాపురికి చెందిన జక్కుల దేవయ్య(60) ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచిపడి మృతి చెందాడు. రోజూ మాదిరిగానే తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.


