పెద్దపల్లిరూరల్: జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చాటారు. పెద్దపల్లి మండలంలో 16 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 476 మంది (251మంది బాలికలు, 225మంది బాలురు) పరీక్షలు రాయగా 461 మంది (242మంది బాలికలు, 219మంది బాలురు) 96.85శాతం ఉత్తీర్ణత సాధించారు.
నూరుశాతం సాధించిన 11 పాఠశాలలు
పెద్దపల్లి మండలంలో 16 ఉన్నత పాఠశాలలు ఉండగా 11 పాఠశాలలు నూరుశాతం ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. అందులో మారెడుగొండ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల వరసగా 12 ఏళ్లుగా నూరుశాతం ఉత్తీర్ణత సాధిస్తూ వస్తోంది.
టాపర్గా భువనశ్రీ
పెద్దపల్లి మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థుల్లో పెద్దపల్లి జెడ్పీ బాలికోన్నత పాఠశాల విద్యార్థిని కాల్వ భువనశ్రీ 581 మార్కులతో మండల టాపర్గా నిలిచింది. ఇదే పాఠశాలకు చెందిన ప్రశాంతి 570మార్కులు, మహాలక్ష్మి 568 మార్కులు, నిట్టూరు హైస్కూల్కు చెందిన సాగాల అక్షర 562 మార్కులు, వర్షిణి 560, తుర్కలమద్దికుంట హైస్కూల్కు చెందిన సాత్విక, శ్రీహర్షిణి 552 మార్కులు, హన్మంతునిపేట హైస్కూల్ విద్యార్థిని కంది హాసిని 552మార్కులు, పెద్దపల్లి జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన రాఘవచంద్ర 551 మార్కులు సాధించారు.


