రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
గొల్లపల్లి(ధర్మపురి): అబ్బాపూర్లో రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రెడపాక లింగయ్య(57), లచ్చవ్వ(49) గ్రామంలో మేసీ్త్ర పని చేసుకుంటూ జీవిస్తున్నారు. వ్యక్తిగత పని నిమిత్తం లచ్చవ్వ బంధువుల ఇంటికి హైదరాబాద్ వెళ్లేందుకు ఆదివారం ద్విచక్ర వాహనంపై దంపతులిద్దరూ కలిసి జగిత్యాల వెళ్తుండగా.. జగిత్యాల నుంచి గొల్లపల్లి వైపు అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చిన తవేరా వాహనం గొల్లపల్లి శివారులో బలంగా ఢీకొంది. లచ్చవ్వ అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్ర గాయాలపాలైన లింగయ్యను చికిత్స నిమిత్తం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనా స్థలాన్ని సందర్శించిన సీఐ రాంనర్సింహారెడ్డి వివరాలు సేకరించారు. వీరికి వివాహమైన కొడుకు, కూతురున్నారు. కోడలు రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణసాగర్రెడ్డి తెలిపారు.
మంథనిరూరల్: రెండు రోజులుగా పెద్దపల్లి జిల్లా మంథని అడవుల్లో సంచరించిన పెద్ద పులి.. ఆదివారం మానేరు నది దాటి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం సాయంత్రం మంథని మండలం భట్టుపల్లి అటవీ ప్రాంతంలో పులి అడుగులు గుర్తించిన అటవీ శాఖ అధికారులు.. ఆదివారం తిరిగి గాలింపు చర్యలు చేపట్టారు. భట్టుపల్లి అటవీ ప్రాంతం నుంచి అడవిసోమన్పల్లి మానేరు నదిలో పులి అడుగుల కోసం అన్వేషణ చేపట్టారు. అయితే మానేరు తీర ప్రాంతంలో అడుగులు కన్పించకపోవడంతో అధికారులు అడవిలోనే మకాం వేసినట్లు భావించారు. కానీ ఆదివారం ఉదయం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడలపేట శివారులోని అటవీ ప్రాంతంలో ఓ ఎద్దుపై దాడి చేసినట్లు సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మంథని, ముత్తారం మండలాల్లోని మానేరు తీర ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు 2 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లభించలేదు. అయితే ముత్తారం మండలం ఓడేడ్, అడవిశ్రీరాంపూర్ మానేరు నది మీదుగా చిట్యాల వైపు వెళ్లే అవకాశాలున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ గాలింపు చర్యల్లో ఎఫ్ఎస్వోలు నర్సయ్య, రహ్మతుల్లా హుస్సేన్, సోని కిరణ్, ఎండీ అఫ్జల్ అలీ, ఎఫ్బీవోలు ప్రదీప్, శ్రీకాంత్, రాంసింగ్, ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం


