● ఒకరి మృతి,
మరొకరికి తీవ్ర గాయాలు
పూసపాటిరేగ: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలియజేసిన వివరాల ప్రకారం.. భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టులో పనిచేసి ఇంటికి వెళ్తున్న ఇద్దరు కార్మికులు శనివారం రాత్రి స్థానిక జాతీయ రహదారి 16పై రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. విమానాశ్రయం నిర్మాణంలో ఎల్అండ్టీ కంపెనీలో పనిచేస్తున్న తమ్మిన జయంతి కుమార్, పాలపర్తి రవీంద్ర పని ముగించుకుని రాత్రి 8.30 గంటల సమయంలో తమ ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. పూసపాటిరేగ మండల పరిధిలోని పోలిపల్లి గ్రామం వద్ద వారు ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ను శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న లారీ (ఏపీ 31 టీహెచ్ 6669) వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవీంద్ర తలకు తీవ్ర గాయం కాగా జయంతికుమార్ కాలు విరిగిపోయింది. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను అనిల్ నీరుకొండ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం రవీంద్ర పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం మెడికవర్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. సీఐ దుర్గాప్రసాద్ ఆదేశాల మేరకు ఎస్సై రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


