ముందస్తు కార్యాచరణ లేకుంటే కష్టమే..
● ఎల్నినో ముప్పుపై అప్రమత్తం ఎప్పుడు ● సాగునీటి వనరులను సద్వినియోగం చేసే మార్గమేదీ?
సాక్షి, పార్వతీపురం మన్యం:
జిల్లాలో సాగునీటి వనరులకు కొదవ లేదు. వాటిని సద్వినియోగం చేసుకోకపోవడం వల్లే రైతులకు నీటి కష్టాలు తప్పడం లేదు. ఎల్నినో ప్రభా వంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమయంలో జల వనరుల శాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి, అందుబాటులో ఉన్న నీటిని ప్రణాళికాబద్ధంగా వినియోగించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా చర్యలు కానరావడం లేదు. సాగునీటి వనరులను సమర్థంగా వినియోగిస్తే.. పంటలతో పాటు భూగర్భ జలాలను కూడా కాపాడే వీలుంది. వాతావరణ శాఖ నిపుణులు, శాస్త్రవేత్తలు ఇప్పటికే ఎల్నినో ప్రభావంపై హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ..అటు ప్రభుత్వం కానీ, ఇటు జల వనరుల శాఖ అధికారులు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. జిల్లాలో నాగావళి, జంఝావతి, రావాడ గెడ్డ, సువర్ణముఖి, చంపావతి వంటి ప్రధాన నదుల్లో ప్రస్తుతం నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఈ నీటిని నిల్వ చేసి కాలువల ద్వారా ఆయకట్టుకు అందించేలా తక్షణ చర్యలు అవసరం.
వర్షాలు లేక, ఎండిపోతున్న వరి నారు
జిల్లాలో ఇప్పటికే సాధారణం కంటే 30 నుంచి 35 శాతం వర్షపాతం లోటు ఉంది. తగినంత వర్షాలు లేక పొలాల్లో నాటిన వరినార్లు, ఆకుమడులు ఎండిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాజెక్టుల్లోకి వచ్చే నీటిని నిల్వ చేసుకుంటూ పంటలను రక్షించే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత జల వనరుల శాఖ, ప్రాజెక్టు కమిటీలపైనే ఉంది. ప్రతి ప్రాజెక్టు పరిధిలో కమిటీ సమావేశాలు నిర్వహించి, అందుబాటులో ఉన్న నీటిని ఎలా సద్వినియోగం చేసుకో వాలనే అంశంపై రైతులకు అవగాహన కల్పించాలి. ప్రస్తుతం తోటపల్లి ప్రాజెక్టులో సుమారు 2.5 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. కాలువల్లో పేరుకుపోయిన పూడిక తొలగింపు, చిన్నపాటి మరమ్మతులు, సీజనల్ లష్కర్ల నియామకానికి ప్రభుత్వం అత్యవసరంగా నిధులు విడుదల చేయాలి. జిల్లాలో సుమారు 1.80 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుండగా.. తోటపల్లి, రావాడ రిజర్వాయర్, జంఝావతి, వెంగళరాయ, పెద్దగెడ్డ, సీతానగరం, పెదంకలాం ఆనకట్టులతో పాటు ఇతర నీటి వనరు ల ద్వారా సుమారు 1.30 లక్షల ఎకరాలకు సాగునీ రు అందే వీలుంది.
ఈ నీటిని సమర్థంగా వినియోగిస్తే ఎల్నినో ప్రభావాన్ని కొంత మేర తగ్గించడమే కాక, భూగర్భ జలాలను కూడా పరిరక్షించవచ్చని రైతు సంఘాలు అంటున్నాయి. సంబంధిత శాఖలు, ప్రాజెక్టు కమిటీలు ఈ దిశగా సరైన శ్రద్ధ చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
రానున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఎల్నినో ప్రభావంతో రైతులతో పాటు ప్రజలు కూడా తాగునీటి సమస్యను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే బోరు బావుల్లో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. దీనిపై కలెక్టర్, ఇతర ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టాం. ఇప్పటికై నా కలెక్టర్ చొరవ తీసుకుని జల వనరులు, వ్యవసాయం, రెవెన్యూ, ఉద్యానవన శాఖల అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించాలి. సాగునీటి నిర్వహణతో పాటు ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించి అవసరమైన భరోసా కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోరింది.
–బుడితి అప్పలనాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి


