● అసహనం వ్యక్తం చేసిన ఆర్డీఓ మాధురి ● మక్కువలో హైస్కూల్ పరిశీలన
మక్కువ: జైలులో ఖైదీలకే మంచి పాత్రల్లో భోజనం పెడుతున్నారు. విద్యార్థులకు మాత్రం చెత్తపాత్రలో వండి, వడ్డిస్తున్నారంటూ ఆర్డీఓ కె.మాధురి భోజన నిర్వాహకులపై మండిపడ్డారు. ఆర్డీవో కె.మాధురి గురువారం మక్కువ జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మరుగుదొడ్లు, రన్నింగ్ వాటర్, మధ్యాహ్నభోజన నాణ్యతను ఆర్డీవో మాధురి పరిశీలించారు. మరుగుదొడ్ల పక్కన చెత్త ఉండటంతో ఇవి పరిసరాలా? లేక చెత్తకుప్పలా? అంటూ అసంతృప్తి వ్యక్తంజేశారు. పరిసరాలు ఈ విధంగా ఉంటే రోగాలు రావా అంటూ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని ఆమె పరిశీలించారు. గ్యాస్తో కాకుండా, కట్టెలతో ఎందు కు వండుతున్నారని ప్రశ్నించారు. వంట పాత్రలను చూసి, మన ఇంట్లో జరిగిన ఫంక్షన్లకు ఇటువంటి పాత్రల్లో పెట్టగలమా? అంటూ నిర్వాహకులను ప్రశ్నించారు. అనంతరం ఆమె పదవతరగతి విద్యార్థులతో ముచ్చటించారు. సిలబస్ ఎంతవరకు అయ్యింది? ఉపాధ్యాయులు బోధిస్తున్న పాఠ్యాంశాలు అర్థమవుతున్నాయా? పాఠశాలలో సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని విద్యార్థులతో ముచ్చటించి తెలుసుకున్నారు. విద్యార్థులు కష్టపడి, ఇష్టప డి చదువుకుని పదవ తరగతి ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత శాతం సాధించాలని ఆర్డీవో మాధురి హితవు పలికారు.


