● జూలై నెలలో జిబ్రాల్టర్ జలసంధిలో ఈదడానికి సన్నహాలు
● దివ్యాంగుడినైనా సప్తసముద్రాలు
ఈదుతానంటున్న గణేష్
సీతంపేట: దివ్యాంగుడైనా ఆయన పట్టువదలని విక్రమార్కుడు. ఈతలో మంచి పట్టు సాధించి సప్త సముద్రాలను ఈది తానేంటో నిరూపిస్తానని అంటున్నారు మండలంలోని కుసుమూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బలగ గణేష్. ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని బూర్జ మండలం డొంకలపర్తి గ్రామం. జూలైనెల 20 నుంచి 29 మధ్య స్పెయిన్ నుంచి మొరాకా మధ్య ఉన్న జిబ్రాల్టర్ జలసంధిని ఈదనున్నట్లు తెలిపారు. 4 గంటల్లో 16 కిలోమీటర్ల దూరం ఆగకుండా ఈదనున్నట్లు చెప్పారు. ఈ సాహసోపేతమైన స్విమ్మింగ్కు అనుమతి కూడా లభించిందన్నారు. 2020 నుంచి స్విమ్మింగ్ పోటీల్లో తాను పాల్గొంటున్నానని 2020లో అవకాశాలు వచ్చినప్పటికీ కరోనా కారణంగా ఆగిపోయినట్లు తెలిపారు. 2025లో శ్రీలంక–ధనుష్కోట మధ్య ఉన్న సముద్రాన్ని 28 కిలోమీటర్లు 10 గంటల 40 నిమిషాల పాటు ఈదినట్లు చెప్పారు. అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పారా స్విమ్మర్గా రికార్డు సాధించానన్నారు. 2025 జూన్ 16న లండన్ నుంచి ఫ్రాన్స్ వరకు 34 కిలోమీటర్లు 13 గంటలపాటు ఇంగ్లీష్ చానల్ ఈదినట్లు తెలిపారు. ఏడు సమూద్రాలను ఈదడానికి నిర్ణయించానని ఇప్పటికి రెండు ఈదానని, మిగతా ఐదు సముద్రాల్లో కూడా స్విమ్మింగ్ చేసి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకోవడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. మరో విశేషమేమిటంటే తన కుమారుడు స్వామినాయుడు రాష్ట్రంలోనే అత్యంత వేగవంతమైన స్విమ్మర్గా ప్రశంస పొందాడన్నారు. తాను ఇచ్చిన కోచింగ్ తన కుమారుడికి ఎంతో ఉపయోగపడిందన్నారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ కార్యాలయంలో డిప్యూ టీ ఈఓ పి.నారాయుడు, ఎంఈవో సూర్య చంద్రరావు తదితరులు ఆయనను అబినందించారు.


