మరియగిరి యాత్రకు ముమ్మర ఏర్పాట్లు
వీరఘట్టం: శ్రీకాకుళం మేత్రాసన పాలక పునీతురాలు, క్రైస్తవుల సహాయమాత మరియమ్మ ఉత్సవం ఈ నెల 30న జరగనుంది. వరప్రసాదాలకు నిలయమైన మేరీమాత స్వస్థతతకు, ప్రశాంతతకు, పరిశుద్ధతకు ఆలవాలం. క్రైస్తవ భక్తుల ఆరాధ్య దేవత మరియమ్మ వీరఘట్టం సమీపంలోని వెంకమ్మ చెరువుకు ఆనుకొని ఉన్న కొండపై వెలిసి ఉన్నారు. మేరీమాత ఉత్సవాలను ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు మరియగిరి కార్యనిర్వహణ కమిటీ సభ్యులు చేస్తున్నారు.
ప్రారంభమైన నవదిన పూజలు
మరియగిరి మహోత్సవానికి తొమ్మిది రోజుల ముందు చేపట్టే నవదిన పూజలు ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ 9 రోజుల పాటు కొండపై జపమాల, దివ్వ పూజలు నిర్వహించనున్నామని నిర్వాహకులు తెలిపారు. వీరఘట్టం, చిట్టపుడివలస, సివిని, పార్వతీపురం, బెలగాం, గరుగుబిల్లి, తూడి, పాలకొండ, వంగర, తలవరం, సంకిలి, నవగాం, పాలవలస గురుమండలాల పీఠాధిపతులు నవదిన పూజల్లో పాల్గొంటున్నారు. 30వ తేదీ ఉదయం నడుకూరు ఆర్సీఎం చర్చి నుంచి మరియగిరి శిఖరం వరకు మేరీమాత ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి, దివ్వ పూజను చేపట్టనున్నారు.
ఈ నెల 30న జరగనున్న మేరీమాత ఉత్సవం కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. మేరిమాత దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నడకదారిలో అన్ని వసతులు ఏర్పాటు చేశాం. ప్రస్తుతం ఈ నెల 29 వరకు నవదిన పూజలు జరుగుతాయి. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా నుంచి కూడా భక్తులు రానున్నారు.
– ఫాదర్ విజయ్రెడ్డి, మరియగిరి
కొండపై ప్రారంభమైన నవదిన పూజలు
ఈ నెల 30న మేరీమాత ఉత్సవం


