
సమష్టికృషితోనే సత్ఫలితాలు
పార్వతీపురం టౌన్: విద్యార్థులు, ఉపాధ్యాయుల సమష్టి కృషి ఫలితమే పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 93.90 శాతంతో రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అన్నా రు. రాష్ట్ర స్థాయిలో జిల్లాను వరుసగా మూడోసారి తొలిస్థానంలో నిలిపినందుకు విద్యార్థులు, తల్లితండ్రులు, ఉపాధ్యాయులను కలెక్టర్ అభినందించారు. పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, దీనికి కారకులైన ఉపాధ్యాయులను విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మై స్కూల్–మై ప్రైడ్ కార్యక్రమంతో మండల ప్రత్యేక అధికారులు తీసుకున్న చొరవ, ప్రత్యేక శ్రద్ధతో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించగలిగారని గుర్తుచేశారు. వినయం, కష్టపడే మనస్తత్వం, ఆలోచన ఇక్కడి విద్యార్థుల సొంతమని కితాబిచ్చారు. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 600 మార్కులకు 592 మార్కులు సాధించిన పెద్దపూడి తేజస్వి, 591 మార్కులు సాధించిన తుంబలి చికీర్ష, 590 మార్కులు వచ్చిన జి.జగదీశ్లకు, విద్యార్థులను ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు కలెక్టర్ పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. తల్లితండ్రులు నిరక్షరాస్యులైనప్పటికీ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఉత్తమ ఫలితాలు సాధించగలిగామని, ఇది ఉపాధ్యాయులకు ఇచ్చే గురుదక్షిణగా భావిస్తున్నట్లు విద్యార్థులు మనోగతాన్ని పంచుకున్నారు.
అనంతరం జిల్లాలోని ప్రతి పాఠశాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు కలెక్టర్ జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి విద్యాశాఖాధికారి రమాజ్యోతి, సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్త ఆర్.తేజేశ్వరరావు, ఉప విద్యాశా ఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లితండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
గురుకుల విద్యార్థులకు
పురస్కారాలు
సాక్షి, పార్వతీపురం మన్యం: సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పార్వతీపురం మన్యం జిల్లాలోని ఐదు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల విద్యార్థులు ఇటీవల విడుదలైన పరీక్ష ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించారు. సంబంధిత విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ప్రిన్సిపాళ్లకు కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్, గురుకులాల విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల సమన్వయకర్త ఎస్.రూపపతి శనివారం ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఇటీవల విడుదలైన పదోతరగతి, ఇంటర్ ఫలితాల్లో గురుకులాలు 96 శాతానికిపైగా ఫలితాలు సాధించాయి. ఎస్ఎస్సీ విభాగంలో ఆర్.రాహుల్– 572(సాలూరు), పి.అమృత– 569(కొమరాడ), సీహెచ్ రోహిత్– 518 (జోగింపేట), వి.త్రివేణి – 567 (గరుగుబిల్లి), టి.పూజ– 552(భామిని).. ఇంటర్ విభాగంలో ఎంపీసీ పి.మేఘన– 972 (గరుగుబిల్లి), డి.దుర్గాభవానీ, బైపీపీ– 974(కొమరాడ), కె.శశికళ, సీఈసీ– 959(భామిని). పి.ఆకాశ్, బైపీసీ– 921(సాలూరు), బి.చైతన్య, బైపీసీ– 919 (పార్వతీపురం)లకు కలెక్టర్ శ్యామ్ప్రసాద్ తన చాంబర్లో ప్రతిభా పురస్కారాలను అందజేశారు. గురుకులాల్లో వంద శాతం ఉత్తమ ఫలితాలు రావడంలో కృషి చేసిన ఉపాధ్యాయులను, ప్రిన్సిపాళ్లను ఈ సందర్భంగా సత్కరించారు.
కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్

సమష్టికృషితోనే సత్ఫలితాలు