
ఏసీబీకి చిక్కిన ట్రాన్స్కో ఇన్చార్జి ఏఈ
● వ్యవసాయ బోరు కనెక్షన్ కోసం లంచం డిమాండ్ ● ఏసీబీ అధికారులను ఆశ్రయించిన రైతు నరసింహరాజు ● రూ.17వేలు లంచం తీసుకుంటుండంగా పట్టుబడిన ఇన్చార్జి ఏఈ జోగినాయుడు ● కేసు నమోదు
మక్కువ: పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం విద్యుత్ సబ్ స్టేషన్లో ఇన్చార్జి ఏఈగా విధులు నిర్వహిస్తున్న గొర్లె జోగినాయుడు గురువారం సాయంత్రం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. విజయనగరం ఏసీబీ డీఎస్పీ బి.వి.ఎస్.ఎస్.రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరానికి చెందిన రైతు బి.నరసింహరాజుకు మక్కువ మండలం సరాయివలస గ్రామం వద్ద కొంత భూమి ఉంది. ఆ భూములో వ్యవసాయ బోరుబోవి ఏర్పాటుకు అవసరమైన విద్యుత్ కనెక్షన్ కోసం గత కొద్ది రోజుల కిందట విద్యుత్ సబ్ స్టేషన్లో దరఖాస్తు చేశారు. బోరుబావికి కనెక్షన్ ఇవ్వాలంటే మూడు విద్యుత్ స్తంభాలు, వైరింగ్, విద్యుత్ తీగలు ఏర్పాటు చేయాల్సి ఉందని, రూ.17వేలు లంచం ఇవ్వాలని ఇన్చార్జి ఏఈ జోగినాయుడు రైతును డిమాండ్ చేశారు. లంచం ఇచ్చేందుకు ఇష్టం లేని రైతు ఈనెల 22వ తేదీన ఏసీబీ అధికారులను సంప్రదించారు. దీంతో వలపన్నారు. మక్కువ విద్యుత్ సబ్స్టేషన్లో గురువారం సాయంత్రం రైతు నుంచి రూ.17వేలు లంచం తీసుకుంటున్న జోగినాయుడును ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేశారు. విశాఖపట్నం ఏసీబీ కోర్టులో శుక్రవారం హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ దాడిలో విజయనగరం, శ్రీకాకుళం ఏసీబీ సీఐలు మహేష్, భాస్కరరావు, ఎస్ఐ వాసునారాయణ పాల్గొన్నారు. 2023లో మక్కువ విద్యుత్ సబ్స్టేషన్లో ట్రాన్స్కో ఏఈగా విధులు నిర్వహించిన పి.శాంతారావు కూడా ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. తరచూ దాడులు జరుగుతున్నా ట్రాన్స్కో అధికారుల్లో మార్పు రాకపోవడం గమనార్హం.