
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్లు శాస్త్రోక్తంగా నిత్య పూజాదికాలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయం వెనుక ఉన్న వేప,రావిచెట్ల వద్ద దీపారాధన చేశారు. ఆలయ ఇన్చార్జ్ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు.
24 నుంచి వేసవి సెలవులు
పార్వతీపురంటౌన్: ఈనెల 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖాధికారి రమాజ్యోతి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు అన్ని యాజమాన్య పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు పేర్కొన్నారు. వేసవి సెలవుల అనంతరం జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయన్నారు. జూన్ 5వ తేదీన స్కూల్ రెసిడెన్షియల్ కార్యక్రమాల కోసం ఉపాధ్యాయులు పాఠశాలల్లో రిపోర్టు చేయాలని ఆమె స్పష్టం చేశారు.
నాణ్యమైన జీడి పిక్కలు కొనుగోలు చేయాలి
● జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్ శోభిక
కొమరాడ: జీడి పరిశ్రమకు అవసరమైన ముడిసరుకు కొనుగోలులో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్ శోభిక సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కొమరాడ మండలం చోళ్లపధం గ్రామంలోని జీడి పిక్కల కొనుగోలు కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా జీడి పిక్కలను పరిశీలించి రికార్డుల మేరకు సక్రమంగా ఉన్నదీ, లేనిది తనిఖీ చేశారు జిల్లాలో జీడి పరిశ్రమకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, నాణ్యమైన జీడిపిక్కలు కొనుగోలు చేసి రికార్డుల్లో సక్రమంగా నమోదు చేయాలని ఆదేశించారు. జీడి బస్తాలను గిడ్డింగిలో జాగ్రత పరచాలని, పరిశ్రమకు తరలించే వరకు పూర్తి బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే వీడీవీకే సభ్యులు, జీడి రైతులతో సంభాషించి సంబంధిత అధికారులు పలు మార్గదర్శకాలను జారీచేశారు. కార్యక్రమంలో వెలుగు ఏపీఎం సురేష్, ఏఓ శంకరరావు తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
● ఇద్దరికి తీవ్ర గాయాలు
గంట్యాడ: మండలంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నంలోని రుషికొండ ప్రాంతానికి చెందిన గద్దెపల్లి దినేష్, గద్దెపల్లి సింహాద్రి, మంగమ్మపేటకు చెందిన గరికిన కార్తీక్లు అరకు వెళ్లి మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో తిరుగు ప్రయాణంలో ద్విచక్రవాహనంపై విశాఖ వెళ్లిపోతుండగా కొండతామరపల్లి విద్యుత్ సబ్స్టేషన్ దాటిన తర్వాత జాతీయ రహదారిపై కానాను బలంగా ఢీకొట్టడంతో బైక్పై నుంచి ముగ్గురూ ఎగిరి పడ్డారు. ఈ ప్రమాదంలో దినేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. సింహాద్రి, కార్తీక్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు 108 అంబులెన్సులో గాయపడిన వారిని చికిత్స కోసం, దినేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం విజయనగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు.

పుష్పాలంకరణలో పైడితల్లి

పుష్పాలంకరణలో పైడితల్లి