
ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులస్తులకు అన్యాయం
● జిల్లా రెల్లికుల సంఘం నాయకుడు గండి డేనియల్
పార్వతీపురంటౌన్: కూటమి ప్రభుత్వం రెల్లి, వాటి ఉపకులాల ఆవేదన ఏమాత్రం పట్టించుకోకపోడం చాలా అన్యాయమని జిల్లా రెల్లికుల సంఘం నాయకుడు గండి డేనియల్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన తన స్వగృహంలో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ రెల్లి ఉపకులాలలకు 1శాతం రిజర్వేషన్ కల్పించి తీవ్ర అన్యాయం చేశారన్నారు. రెల్లి సామాజిక వర్గానికి సంబంధించి ఆర్థిక, సామాజిక, ఉద్యోగ, రాజకీయాల్లో వెనుకబాటుతనం గురించి తెలిసికూడా ఒక్క శాతం రిజర్వేషన్ కల్పించి ఆర్డినెన్స్ తేవడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. బలవంతులైన మాల, మాదిగలకే అధికప్రాధాన్యం ఇస్తున్నారని, అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న రెల్లిలను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల్లో ఇంతవరకు అభివృద్ధి చెందని వారికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించిందని, కానీ కూటమి ప్రభుత్వం కులగణన ఇంతవరకు చేయలేదన్నారు. రెల్లి వాటి ఉపకులాలు చాలా తక్కవ జనాభా కలిగి ఉన్నాయని ఏ ఆధారాలతో నిర్ణయిస్తారని మండిపడ్డారు. లోపభూయిస్టమైన ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రభుత్వం ఆలోచించి రెల్లీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో గండి శరత్ చైతన్య, సొండి గౌరీశంకర్రావు తదితరులు పాల్గొన్నారు.