ప్రతి ఇంటికీ ఆడబిడ్డనయ్యా | Sakshi
Sakshi News home page

ప్రతి ఇంటికీ ఆడబిడ్డనయ్యా

Published Wed, May 8 2024 7:55 AM

-

గిరిజనుల ఆత్మబంధువును 

 ఏజెన్సీ ప్రజలకు ప్రభుత్వంపై సంపూర్ణ విశ్వాసం 

 పదేళ్లు అండగా నిలిచారు 

 చంద్రబాబు వస్తే ఇప్పుడున్న పథకాలకు ముగింపు పడినట్లే.. 

 సాక్షితో పాలకొండ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విశ్వాసరాయి కళావతి

సాక్షి, పార్వతీపురం మన్యం: ఏజెన్సీలో గిరిజన ప్రజలందరికీ నేను ఆత్మబంధువును. నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ ఆడబిడ్డనయ్యాను. పదేళ్లుగా పాలకొండ నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరిస్తూ అండగా నిలుస్తున్నారు. ఈ ప్రేమాభిమానాలు మున్ముందూ ఇలాగే సాగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. నియోజకవర్గంలోని 102 సచివాలయాల పరిధిలోని దాదాపు 78 వేల గడపల వద్దకు వెళ్లి వారందరితో మమేకమయ్యా. కష్టసుఖాలు తెలుసుకున్నా. ఇన్ని వేల కుటుంబాలను నాకు ఇచ్చింది జగనన్నే.’’ అని పాలకొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని విశ్వాసరాయి కళావతి అన్నారు. పాలకొండ నియోజకవర్గంలో ఇంతవరకు చేసిన అభివృద్ధి, ఇంకా చేయబోయే పనులు..కూటమి దుష్ప్రచారం తదితర అంశాలను ‘సాక్షి’తో ముఖాముఖిలో ఆమె వివరించారు. వివరాలు ఆమె మాటల్లోనే.. 

ప్రజల కోసమే..పదవి
మా కుటుంబంలో చాలామంది ఎమ్మెల్యేలున్నారు. నేను రెండుసార్లు గెలిచాను. పదవులు మాకు ము ఖ్యం కాదు. విలువలతో కూడిన ఎదుగుదల మా పెద్దల నుంచి నేర్చుకున్నా. అందుకే ఎప్పుడూ నిరా డంబరంగా ఉంటా. మా ప్రజల ప్రతి కష్టసుఖంలో నూ తోడుగా ఉంటా. వారితో కలిసిపోతాను. ఎప్పు డూ ప్రజల్లోనే ఉండాలని మా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చెబుతుంటారు. అందుకే అందరూ నన్ను ఆశీర్వదిస్తూ, వారి బిడ్డగా చూసుకుంటారు. ఇప్పు డు ప్రచారానికి వెళ్లినప్పుడు కూడా ఎక్కడికక్కడ బ్రహ్మరథం పడుతున్నారు. మళ్లీ వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో మరింతగా ప్రజలకు సేవ చేసుకుంటాం.

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అయితేనే తమకు మేలు చేస్తాడన్న నమ్మకం, భరోసా గిరిజనులందరిలోనూ ఉందని వైఎస్సార్‌సీపీ పాలకొండ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వాస రాయి కళావతి అన్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో వివిధ సంక్షేమ పథకాల కింద దాదాపు రూ.1,300 కోట్ల మేర నియోజకవర్గంలోని పేదలకు అందించామని చెప్పారు. నాన్‌ డీబీటీ కింద సుమారు రూ.218 కోట్ల మేర వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులు పొందారని వివరించారు. గడిచిన 59 నెలల కాలంలోనే ఇదంతా సాధించామని చెప్పారు. ఎన్నికలొచ్చాయని ప్రజల ముందుకు బూటకపు హామీలతో వస్తున్న విషపు కూటమి నేతలను ఎవరూ నమ్మవద్దని హితవు పలికారు.

సంపూర్ణంగా మహిళా సాధికారత
2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో అమలు చేసిన నవరత్నాల పథకాలు ప్రతి ఇంటికీ అందాయి. జీవితాలను బాగు చేశాయి. గతంలో ఏ ప్రభుత్వమూ ఇన్ని పథకాలను విజయవంతంగా 99 శాతం అమలు చేసింది లేదు. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ ఒడి పథకాన్ని రూ.17 వేలకు పెంచుతున్నాం. రైతులకు ఇచ్చే భరోసా మొత్తం రూ.16 వేలు అవుతుంది. దీనివల్ల రైతుకు మరింత సాయం అందించేవారమవుతాం. మహిళల సాధికారత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే సాధ్యమైంది. ప్రతి పథకం మహిళలకే అందుతోంది. చేయూత పథకం ద్వారా ఎంతో మంది స్వయం ఉపాధి పొందారు. కొందరు భూములు, బంగారం కొనుగోలు చేసుకుని భవిష్యత్తు అవసరాలకు ఉంచుకున్నారు.

నిన్ను ఎలా నమ్ముతారు బాబూ..
గత టీడీపీ హయాంలో నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా గిరిజనులకు ఎటువంటి పథకాలూ అందలేదు. కనీసం రేషన్‌కార్డులు, ఆధార్‌ కార్డులు వంటివి కూడా లేవు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే వలంటీర్ల ద్వారా లబ్ధిదారులను గుర్తించి ప్రతి ఇంటికీ మేలు చేశాం. ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కూటమిగట్టి..బూటకపు హామీలిస్తున్నాయి. అవేవీ నమ్మశక్యంగా లేవు. 2014 మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఎన్ని అమలు చేశారు? పోనీ, ఇప్పుడు మేనిఫెస్టో కూడా ఉమ్మడిగా ఇచ్చే ధైర్యం చేయలేకపోయారు. కూటమిలోని బీజేపీ దూరంగా ఉంది. అంటే..దాని అమలు మీద వారిలో వారికే నమ్మకం లేదు. ఇంక ప్రజలు ఎలా నమ్ముతారు..

అభివృద్ధి అంటే ఇది కాదా?
59 నెలల కాలంలో గతంలో ఏ ప్రభుత్వమూ చేయని అభివృద్ధి నియోజకవర్గంలో చేసి చూపించాం. కొన్ని పెండింగ్‌ పనులు మిగిలిపోయాయంటే..అది గత టీడీపీ ప్రభుత్వ కక్షపూరిత వైఖరే. ఆ విషయం విజ్ఞులైన నియోజకవర్గ ప్రజలు, మేధావులందరికీ తెలుసు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 4,086 మందికి ఇళ్ల పట్టాలిచ్చాం. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించాం. కిమ్మి–రుషింగి వంతెన నిర్మాణం రూ.27.50 కోట్లతో పూర్తి చేశాం. సీతంపేటలో సుమారు రూ.50 కోట్లతో మల్లీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం జరుగుతోంది. 

సీతంపేట ఆస్పత్రిని రూ.19 కోట్లతో అప్‌గ్రేడ్‌ చేశాం. టీటీడీ ద్వారా రూ.10 కోట్లతో ఆలయాన్ని నిర్మించాం. 146 దేవాలయాలకు ఒక్కో గుడికి రూ.10 లక్షలు చొప్పున టీటీడీ దేవస్థానం నుంచి మంజూరు చేయించాం. బత్తిలిలో రూ.2.5 కోట్లతో మోడల్‌ పోలీస్‌స్టేషన్‌ నిర్మాణం చేపట్టాం. నియోజకవర్గంలో రూ.214 కోట్లతో సుమారు 234 కి.మీ. మేర రోడ్లు, 41 కి.మీ మేర డ్రైన్లు వేశాం. 102 సచివాలయాల నిర్మాణం, ఆర్‌బీకేలు, వెల్‌నెస్‌ సెంటర్ల నిర్మాణం, నాడు–నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి మా హయాంలోనే చేపట్టాం. 

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలు చొప్పున వెచ్చించి మరిన్ని పనులు చేశాం. సంక్షేమ పథకాల లబ్ధి కోసం మరో రూ.1,500 కోట్లకుపైగా వెచ్చించాం. ఇదంతా అభివృద్ధి కాదా? ముందు ప్రభుత్వాలు ఇవేవీ ఎందుకు చేయలేదు? మాపై దుష్ప్రచారం చేస్తున్న వారు వీటికి సమాధానం చెప్పగలరా? కరోనా వంటి కష్టకాలంలో పేదలకు మా ప్రభుత్వం అండగా నిలిచింది. అందుకే ఇప్పుడు ధైర్యంగా వారి వద్దకు వెళ్లగలుగుతున్నాం. పెండింగ్‌లో ఉన్న ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పనులు ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తాం.

పర్యాటకంగా అభివృద్ధి, ఉపాధి
సీతంపేటలో పర్యాటకంగా అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయి. రూ.2.5 కోట్లతో అడలి వ్యూపాయింట్‌, గిరిజన మ్యూజియం అభివృద్ధితోపాటు, మరికొన్ని ప్రాంతాలు, జలపాతాలపై దృష్టి సారించాం. ఇప్పటికే ఇక్కడ అడ్వెంచర్‌పార్కు ఉంది. నేను అభివృద్ధి కోరుకునేదానిని. టూరిజం కోసం అప్పట్లోనే ప్రశ్నించా. యువతకు కూడా స్థానికంగా నే ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో పరిశ్రమలు తె చ్చే ఆలోచన ఉంది. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టాం. దాదాపు 10 వేల మంది వరకూ ఇక్క డే ఉపాధి లభిస్తే బాగుంటుందన్నది నా ఆలోచన.

కూటమికి ప్రజలే బుద్ధి చెబుతారు..
కూటమి పేరుతో ఓట్ల కోసం వస్తున్న వారి గత చరిత్ర ఎలాంటిదో ఇక్కడ అందరికీ తెలుసు. వారి అవినీతి గురించి ఎంత చెప్పినా తక్కువే. వారికి ప్రజలే ఓట్ల ద్వారా బుద్ధి చెబుతారు.

 

Advertisement
Advertisement