కుమార్తెను చూసేందుకు బైకుపై వెళుతుండగా దుర్ఘటన
రాజుపాలెం: మృత్యువు ఏ రూపంలో వస్తుందో అంతుపట్టనే పట్టడు. కుమార్తె ప్రసవం కోసం వైద్యశాలలో ఉండడంతో ఆమెను చూసేందుకు బైకుపై వెళుతున్న వ్యక్తికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బైకు దిగేలోపే మృతి చెందిన విషాద ఘటన మండలంలోని కొండమోడు సమీపంలోని వీరమ్మ కాలనీ మలుపు వద్ద అద్దంకి–నార్కెట్పల్లి రహదారిపై బుధవారం జరిగింది. దుర్గి మండలం అడిగొప్పల గ్రామానికి చెందిన దోమనబోయిన సైదులు (45) తన చిన్న కూతురు నాగమణిని నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవం కోసం చేర్పించారు. కుమార్తెను చూసేందుకు పిడుగురాళ్ల నుంచి నరసరావుపేటకు బైకుపై వెళుతున్నాడు. కొండమోడు సమీపంలో గుండెపోటు రావడంతో బైకును పక్కకు తీసి ఆపేలోపే వాహనంతోపాటు కిందపడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ మణికృష్ణ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.


