గుంటూరు మెడికల్: డీఎంహెచ్ఓ కార్యాలయం పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎఫ్ఎన్ఓ, ఎల్జీఎస్ ఉద్యోగాలకు జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీహెచ్సీ, అర్బన్ పీహెచ్సీల్లో 45 పోస్టులకు గాను దరఖాస్తు చేసుకున్న వారి ప్రొవిజనల్ మెరిట్ లిస్టును శుక్రవారం విడుదల చేశామన్నారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 25వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు గుంటూరు డీఎంహెచ్ఓ కార్యాలయంలో లిఖిత పూర్వకంగా తెలియజేయాలన్నారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టును గుంటూరు.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు.
పెదకాకాని: చరిత్ర పుస్తకాలు మన సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలు తెలుసుకునేందుకు దోహదపడతాయని వర్సిటీ ఇన్చార్జి వీసీ ఆచార్య కె.గంగాధరరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వలయంలో శుక్రవారం గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రముఖ బాల సాహితీవేత్త, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ షేక్ అబ్దుల్ హకీంజానీ రచించిన మన కవుల చరిత్ర మొదటి భాగం గ్రంథాన్ని వీసీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 70కి పైగా పుస్తకాలను రచించిన అబ్దుల్ హకీంజానిని అభినందించారు. ఈ సందర్భంగా హకీంజానీ మాట్లాడుతూ 500 పేజీలకు పైగా మన కవుల చరిత్ర రెండవ విభాగం త్వరలో వెలువడుతుందన్నారు.


