ఏపీఎఫ్డీసీ ఎండీ కేఎస్ విశ్వనాథన్
తెనాలి: రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కేఎస్ విశ్వనాథన్ చెప్పారు. స్థానిక అంబేడ్కర్ జూనియర్ కాలేజ్లో మా–ఏపీ నిర్వహిస్తున్న మూడు రోజుల ఉచిత సినీనటన శిక్షణ తరగతులను శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం రూ.నాలుగు కోట్ల లోపు చిత్రీకరించిన 15 చిన్న బడ్జెట్ సినిమాలకు సబ్సిడీ రూ.10 లక్షల చెల్లింపునకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. సినిమా నటనపై అవగాహన కోసం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వివిధ ప్రాంతాల ఔత్సాహికులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్న మా ఏపీ వ్యవస్థాపకులు, సినీదర్శకుడు దిలీప్ రాజాను అభినందించారు. ఆంధ్రాలో సినిమాలు చిత్రికరించే నిర్మాతలకు ప్రభుత్వం మౌలిక సదుపాయలను కల్పించడానికి టూరిజం శాఖ సమన్వయంతో కార్యాచరణను సిద్ధం చేసిందని విశ్వనాథన్ వివరించారు. దీనికోసం మా–ఏపీ సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని చెప్పారు. శిక్షణ తరగతుల నిర్వాహకుడు, దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ సినిమాలో నటించాలనుకునే ఔత్సాహికులకు శిక్షణలో ప్రాథమిక అంశాలను బోధిస్తున్నామని చెప్పారు. అభ్యర్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను ఇస్తామని చెప్పారు. విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి డి.మధుబాబు, తూటా రామకృష్ణ, మధుమతి, కెమెరా హరి శ్రీనివాస్, మహిళా దర్శకురాలు నాగశ్రీ, జాలా రాజ కుమారి, స్టైల్ రవి, రమేష్ పాల్గొన్నారు.


