రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య
వినుకొండ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి ఢిల్లీ తరహాలో ఉధృతమైన పోరాటాలు చేయాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య పిలుపునిచ్చారు. పట్టణంలోని అవ్వారు కల్యాణ మండపంలో రెండు రోజుల పాటు జరిగే అఖిల భారత కిసాన్ మహాసభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. మోడీ ప్రభుత్వం అమెరికా ఆంక్షలకు లొంగి దేశీయ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తోందని విమర్శించారు. ఎరువుల ధరలు పెంచి రైతులపై భారం మోపుతోందని మండిపడ్డారు. గిట్టుబాటు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, పత్తి, మొక్కజొన్న రైతులు దళారుల చేతిలో మోసపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు భూములు కట్టబెట్టడం ఆపాలని, మద్దతు ధరతో ప్రభుత్వమే నేరుగా పంటలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మహాసభల్లో పల్నాడు జిల్లా రైతు సంఘం నాయకులు ఏపూరి గోపాలరావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గుంటూరు విజయ్కుమార్, జిల్లా కార్యదర్శి ఆంజనేయులునాయక్, వై.రాధాకృష్ణ, ఎల్ఐసీ యూనియన్ నాయకులు బొంకూరి వెంకటేశ్వర్లు, ఏజీపీ జ్ఞానేశ్వరరావు, న్యాయవాది రామకోటేశ్వరరావు, రైతు సంఘం నాయకులు సురేష్ రాజా, ముని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


