నరసరావుపేట రూరల్: వన్ టైం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు అండదండలతో రెచ్చిపోయి దాడులకు పాల్పడే వారు భవిష్యత్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైఎస్సార్సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావును జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఆయన కలిశారు. వైఎస్సార్సీపీ పట్టణ సోషల్ మీడియా అధ్యక్షుడు హన్నుపై దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని కోరారు. నిందితులపై సెక్షన్ 324 కింద కేసు నమోదు చేశారని, దీనిని 307గా మార్చాలన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... లింగంగుంట్ల రాజుపాలెంలో హన్నుపై టీడీపీ గూండాలు జరిపిన దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.
ఎమ్మెల్యే అండతోనే...
హన్నుపై దాడి వెనుక ఎమ్మెల్యే ప్రొద్బలం ఉందన్నారు. ఘటనా స్థలంలో నిందితులు వినియోగించిన బులెట్ మీదనే ఎమ్మెల్యే తన పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారని తెలిపారు. విశ్వామిత్ర టీ స్టాల్ యజమాని పొట్లూరి వెంకి ఈ దాడికి ముఖ్య సూత్రధారిగా వ్యవహరించాడని ఆరోపించారు. వరుస దాడులు వెంకి ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలిపారు. భవిష్యత్లో వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అనంతరం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హన్నును పరామర్శించారు. కార్యక్రమంలో జిల్లా వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షురాలు రోళ్ల మాధవి, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ కరీముల్లా, వర్కింగ్ అధ్యక్షుడు అచ్చి శివకోటి, ఖాజావలి మాస్టారు, సోషల్ మీడియా నియోజకవర్గ అధ్యక్షుడు బూదాల కల్యాణ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
జిల్లా వైఎస్సార్సీపీ వర్కింగ్
ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి


