బెల్లంకొండ: మండలంలోని పాపాయపాలెం గ్రామంలో మంగళవారం నాటుబాంబులు కలకలం సృష్టించాయి. గ్రామంలోని శ్రీకృష్ణ దేవాలయం సమీపంలో గ్రామానికి చెందిన సంక్రాంతి కోటయ్య అనే వ్యక్తి ఇంటి వద్ద ఐదు నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక ఎస్ఐ పి.గోపి తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం... కోటయ్య ఇంటి వద్ద నాటు బాంబులు గుర్తించిన గ్రామ వీఆర్వో పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. పోలీసులు తనిఖీ నిర్వహించగా ఇంటివద్ద మరుగుదొడ్డిలో ఒక ప్లాస్టిక్ డబ్బాలో వరిపొట్టులో ఉన్న ఐదు నాటు బాంబులను లభ్యమయ్యాయి. వెంటనే సత్తెనపల్లి డీఎస్పీ ఎం. హనుమంతరావు, క్రోసూరు సీఐ ప్రత్తిపాటి సురేష్లు బాంబు స్క్వాడ్, క్లూస్ టీం, ఆర్ఎఫ్ఎస్ఎల్ సభ్యులతో గ్రామానికి చేరుకున్నారు. బాంబులను స్వాధీనం చేసుకుని, ఊరి చివరకు వెళ్లి వాటిని పరిశీలించారు. బాంబులను సీజ్ చేసి సంబంధిత నైపుణ్యుల నిర్ధారణ కోసం పంపారు. ఘటనపై విచారణ చేపట్టి పూర్తి వివరాలను వెల్లడిస్తామని డీఎస్పీ హనుమంతరావు తెలిపారు.


