జిల్లా ఎస్పీని కలిసిన వినుకొండకు చెందిన ఖాదర్బాషా ఖాదర్బాషా సోదరుడు రషీద్ 2024లో దారుణహత్య ఈ కేసులో నలుగురి బెయిల్ రద్దు చేసిన హైకోర్టు కోర్టులో లొంగిపోని నిందితులు వీరి నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు
నరసరావుపేట రూరల్: బెయిల్పై విడుదలైన నిందితులతో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని వినుకొండలో దారుణహత్యకు గురైన షేక్ రషీద్ సోదరుడు ఖాదర్బాషా తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ బి.కృష్ణారావును ఖాదర్బాషా కలిసి ఫిర్యాదు చేశారు. 2024 జూలై 17వ తేదీన రషీద్ను వినుకొండలోని మెయిన్రోడ్డులో దారుణంగా నరికి హత్య చేసిన విషయం విదితమే. ఈ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో మొదటి నిందితుడు మినహా మిగిలిన వారు బెయిల్పై విడుదలయ్యారు. ఈ కేసులో ఏ–2 పఠాన్ సిద్దిక్, ఏ 5 అంబులెన్స్ రఫీ, ఏ 8 కొమ్మా వెంకటసాయి, ఏ 12 పఠాన్సైదా నుంచి నా కుటుంబానికి ప్రాణహని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. వీరి బెయిల్ రద్దు చేయమని హెకోర్టులో క్రిమినల్ పిటీషన్ దాఖలు చేయగా, గత నెల 17వ తేదీన బెయిల్ను రద్దు చేసినట్టు వివరించారు. ఈ కేసులో ఏ 2, ఏ 5, ఏ 8, ఏ 12 నిందితులను వారం రోజుల్లోపు కోర్టులో లొంగిపోవాలని తీర్పునిచ్చినట్టు తెలిపారు. నేటి వరకు నిందితులు కోర్టులో హాజరుకాలేదని, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఖాదర్ బాషా కోరాడు.


