బొల్లాపల్లి: భార్యతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఓ తండ్రి తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బొల్లాపల్లి మండలం గంగుపల్లి తండాలో కలకలం రేపింది. గంగుపల్లి తండాకు చెందిన బాణావత్ చిన్నినాయక్కు అతని భార్య బుజ్జిబాయికి కొంతకాలంగా గొడవలు జరుగుతుండటంతో, ఆమె సుమారు 20 రోజులుగా తన చిన్న కుమారుడు ఈశ్వర్ నాయక్ (6)తో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య బుజ్జి బాయిని కాపురానికి తీసుకువచ్చే ప్రయత్నాలు విఫలం కావడంతో తీవ్ర మనస్థాపానికి గురైన చిన్ని నాయక్, శనివారం ఉదయం తన చిన్నకుమారుడిని తనతోపాటు ఇంటికి తీసుకొచ్చాడు. సాయంత్రం సమయంలో కూల్డ్రింక్ బాటిల్లో గడ్డి మందు కలిపి, తన పెద్ద కుమారుడు శివ నాయక్ (7) మరియు చిన్న కుమారుడు ఈశ్వర్ నాయక్లకు తాగించి, తాను కూడా తాగాడు. ముగ్గురూ కలిసి సుమారు పావు లీటర్ విషం తాగినట్లు తెలిసింది. అనంతరం వారు అస్వస్థతకు గురవ్వడాన్ని గమనించిన గ్రామస్తులు, పిల్లలను ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే గ్రామస్తులు ముగ్గురిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి తండ్రి చిన్ని నాయక్, పెద్ద కుమారుడు శివ నాయక్ను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి, చిన్న కుమారుడు ఈశ్వర్ నాయక్ను మెరుగైన చికిత్స కోసం గుంటూరు కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
భార్య కాపురానికి రాలేదనే కోపంతో ఘాతుకం
నిలకడగా ముగ్గురి ఆర్యోగం


