నరసరావుపేట: సీ్త్రనిధి రుణాలు కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా జిల్లాలోని అన్ని మండలాల్లోని స్వయం సహాయక సంఘాలకు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన వార్షిక రుణ, జీవనోపాధి ప్రణాళిక జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కొన్ని సంఘాల్లో కనీస సభ్యుల సంఖ్య లేకపోవడం వల్ల రుణ ప్రణాళిక అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ సమస్యను అధిగమించేందుకు అన్ని సంఘాలకు మైక్రో క్రెడిట్ ప్లాన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఈ ఏడాది సీ్త్రనిధి యాక్షన్ ప్లాన్ కింద రూ.257.44 కోట్లు, ఉన్నతి యాక్షన్ ప్లాన్ కింద రూ.42.15 కోట్లను లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకేజీలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేస్తూ, ఇందుకు సహకరించిన బ్యాంకు ప్రతినిధులను సత్కరించారు. కేవలం రుణాలు అందించడమే కాకుండా, ఏ తరహా రుణాలు పొందితే సభ్యులకు గరిష్ట ఆదాయం లభిస్తుందో క్షేత్రస్థాయిలో వివరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు బ్యాంకు రుణాల వినియోగంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. మండల స్థాయిలో అభివృద్ధి క్లస్టర్లు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల లింకేజీ ద్వారా ఎక్కువ మొత్తంలో రుణాలు మంజూరు చేసేందుకు ప్రత్యేక కృషిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సెర్ప్ డైరెక్టర్, డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి, డీపీఎం శ్రీనివాస్ పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా


