‘ఉపాధి’ అవినీతి రూ.8 లక్షలు
నూజండ్ల: పనుల వద్ద బోర్డులు ఏర్పాటు చేయకపోవటం, నిశాని పేరుతో సంతకాలు లేకుండా డబ్బులు జమ చేయటం, ఉపాధి సిబ్బంది, క్షేత్ర సహాయకుల తప్పులు పునరావృతం అవుతుండటం పట్ల డ్వామా పీడీ లింగమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకూ జరిగిన విచారణలో ఉపాధి హామీ పథకంలో అవినీతి, అక్రమాలు వెలుగుచూశాయి. మండల పరిషత్ కార్యాలయం వద్ధ ఎంపీడీవో ఉమాదేవి అధ్యక్షతన జరిగిన ప్రజావేదికకు డ్వామా పీడీ సిద్ధ లింగమూర్తి హాజరయ్యారు. మండల పరిధిలో 27 పంచాయతీల్లో 669 పనులకుగాను రూ.12 కోట్ల 41 లక్షల నిధుల వినియోగంపై జరిగిన అవకతవకలను డీఆర్పీలు సభలో చదివి వినిపించారు. విచారణలో కొన్ని విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. తిమ్మాపురం గ్రామంలో స్థానికేతరులు, విదేశాల్లో ఉన్నవారికి, అంగన్వాడీ సిబ్బందిలోని ఆయాలు, ఆశా కార్యకర్తలు, హైదరాబాద్లో నివాసం ఉండేవారితో కలిపి 50 మందికిపైగా అనర్హులు జాబ్కార్డులు కలిగి ఉన్నారని... క్షేత్ర సహాయకుడు వారికి మస్టర్లు వేసి డబ్బులు డ్రా చేశారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అదే వ్యక్తికి చెందిన కుటుంబంలో భార్య పేరుతో రెండు, 14 సంవత్సరాల కుమార్తెకూ, కుటుంబ సభ్యులందరికీ జాబ్కార్డులున్నాయని పీడీ దృష్టికి తెచ్చారు. క్షేత్ర సహాయకుడు గైర్హాజరు కావటంతో షోకాజ్ నోటీస్ ఇవ్వాల్సిందిగా పీడీ ఆదేశించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ రూ.2.71 లక్షల రికవరీ చేయలని రాయటం జరిగిందని తెలిపారు. రూ.5.30 లక్షలు థర్డ్ పార్టీ విచారణకు ఆదేశించటం జరిగిందన్నారు. క్షేత్ర సహాయకులు, ఉపాధి సిబ్బంది బాధ్యతగా పనులు చేయకపోతే క్రమశిక్షణ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీడీ బూసిరెడ్డి, ఎస్ఆర్పీ ఆవులయ్య, విజిలెన్సు అధికారులు విజయకుమారి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
తిమ్మాపురం పంచాయతీలో
విస్తుగొలిపే అక్రమాలు


