తండాల్లో పైపులైన్లకు అనుమతులివ్వండి
నరసరావుపేట: జిల్లాలోని గిరిజనులు నివసించే ప్రాంతాల్లో జల్జీవన్ మిషన్ కింద మంజూరైన రహదారులు, పైపులైన్లు నిర్మించేందుకు అనుమతులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు అటవీ శాఖ అనుమతులపై బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. జిల్లాలోని ఆరు మండలాలకు చెందిన 22 తండాల్లో నీటి పైపులైన్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి దాదాపు 65 కి.మీ. పొడవైన పైపులైన్ నిర్మిస్తే 22 తండాలకు తాగునీటి సమస్య ఇకపై ఉండదన్నారు. అదేవిధంగా పీఎం జన్మన్ వంటి పథకాల ద్వారా గిరిజన ప్రాంతాల్లో మంజూరైన రహదారుల నిర్మాణాలు వేగవంతం చేయలని పేర్కొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణప్రియ, పంచాయతీరాజ్ ఈఈ కె.ముత్తయ్య, గుంటూరు పంచాయతీరాజ్ ఈఈ ఎం.సంపత్ కుమార్లు హాజరయ్యారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా


