మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిరస్మరణీయుడు
నరసరావుపేట: దివంగత మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్రోద్యమ స్ఫూర్తి ప్రదాత అని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఆదివారం గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయంలో ఆజాద్ వర్ధంతి నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా సేవలందించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ తన రచనల ద్వారా యువతలో స్వాతంత్య్ర ఉద్యమ చైతన్య స్ఫూర్తిని కలిగించారని అన్నారు. ఆయన మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూలతో కలిసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని తన పుస్తకాలు, రచనల ద్వారా యువతను చైతన్యపరిచి స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారని వెల్లడించారు. పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ కరిముల్లా, వర్కింగ్ అధ్యక్షులు అచ్చి శివకోటి, మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ మహబూబ్ బాషా, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి నెలటూరి సురేష్, మాజీ కౌన్సిలర్ షేక్ మీరావలి, బీసీ సెల్ అధ్యక్షులు మర్రిపూడి రాంబాబు, విద్యార్ది విభాగ అధ్యక్షులు మనీంద్రరెడ్డి, బాదుగున్నల శ్రీను, చందు పాల్గొన్నారు.


