పల్నాడు
న్యూస్రీల్
ముందస్తు అనుమతులపై జెడ్పీ సమావేశంలో రగడ ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం ఇవ్వని తీరుపై మండిపాటు ఆమోదానికి నోచుకోని ఆర్థిక సంవత్సర బడ్జెట్ నిధుల్లేకుండానే అనుమతులపై వైఎస్సార్సీపీ సభ్యుల వ్యతిరేకత చైర్ పర్సన్ తీరుతో సమావేశ బహిష్కరణ
ఆదివారం శ్రీ 22 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
గోళ్లపాడు(ముప్పాళ్ల): మండలంలోని గోళ్లపాడు గ్రామంలో వేంచేసియున్న ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవంలో భాగంగా శనివారం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అఖండ నామసంకీర్తనం అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు.
విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 540.80 అడుగులకు చేరింది. కుడి కాలువకు 8,831, ఎడమ కాలువకు 9,076 క్యూసెక్కులు వదిలారు.
తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.8000, గరిష్ట ధర రూ.9000, మోడల్ ధర రూ.8500 వరకు పలికింది.
ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. ఆర్థిక సంవత్సర బడ్జెట్ ఆమోదానికి శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా వైఖరితో విభేదించిన వైఎస్సార్ సీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు అర్ధాంతరంగా వెళ్లిపోయారు. అజెండా ఆమోదానికి తగిన బలం లేక సమావేశాన్ని వాయిదా వేశారు.
గుంటూరు ఎడ్యుకేషన్ : జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియాతోపాటు ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, సీఈవో వి.జ్యోతిబసు, ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన జెడ్పీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
నిధులు లేకుండా కేటాయింపులా?
సమావేశపు అజెండాలో పొందుపర్చిన అంశాల్లో ఆర్థిక సంవత్సర బడ్జెట్తో అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు, చైర్పర్సన్ ముందస్తుగా ఇచ్చిన అనుమతులను ఆమోదించాల్సిందిగా సభ్యుల ముందు ఉంచారు. దీనిపై వైఎస్సార్ సీపీకి చెందిన రొంపిచర్ల జెడ్పీటీసీ సభ్యుడు పిల్లి ఓబుల్రెడ్డి మాట్లాడుతూ అజెండాలో పొందుపర్చిన అంశాల్లో బడ్జెట్ మినహా, చైర్పర్సన్ ముందస్తుగా ఇచ్చిన అనుమతులను వైఎస్సార్ సీపీ పరంగా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. జెడ్పీ ఆదాయ వనరులను దృష్టిలో ఉంచుకోకుండా ఏకపక్షంగా రూ.కోట్లాది పనులకు అనుమతులు ఇచ్చేస్తే, పనులు పూర్తయ్యాక బిల్లులు ఏ విధంగా చెల్లిస్తారో చెప్పాలన్నారు. జెడ్పీ సాధారణ బడ్జెట్ నిధుల నుంచి రూ.8.84 కోట్లు ఉన్నట్లు చూపారని, 15వ ఆర్థిక సంఘ నిధులను దృష్టిలో ఉంచుకుని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సదుపాయానికి రూ.31.25 కోట్లకు అదనంగా మరో రూ.5.22 కోట్లు కేటాయింపులు జరిపారని చెప్పారు. అయితే జెడ్పీకి వచ్చే ఆదాయాన్ని, గ్రాంట్లను పరిగణనలోకి తీసుకోకుండా రూ.30 కోట్లకు పైగా పనులకు అనుమతులు ఇచ్చేశారని పేర్కొన్నారు.
సంబంధిత పనులకు చైర్పర్సన్ హెనీ క్రిస్టినా ఏకపక్షంగా ఇచ్చిన అనుమతులను జెడ్పీటీసీలుగా తాము గుడ్డిగా ఆమోదిస్తే. కాంట్రాక్టర్లకు బిల్లులు ఏ విధంగా చెల్లిస్తారని ప్రశ్నించారు. స్టాంప్ డ్యూటీ సర్చార్జి రూపంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.18 కోట్లలో రూ.1.40 కోట్ల మినహా మిగిలిన నిధులు తెచ్చుకోలేకపోయారని అన్నారు. మరో ఆర్నెల్లలో జెడ్పీ పాలకవర్గ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో రూ. కోట్లాది విలువైన పనులకు ఇనుమతులు ఇవ్వడం సమంజసం కాదని, భవిష్యత్తులో బిల్లులు చెల్లించే బాధ్యతను అధికారులు తీసుకుంటారా? అని నిలదీశారు. దీనిపై చైర్పర్సన్తోపాటు సీఈవో సూటిగా సమాధానం చెప్పలేకపోయారు.
పక్కన పెట్టేస్తున్నారు..
గుంటూరు జిల్లా ప్రజా పరిషత్కు రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు ఉందని, ప్రజల ఓట్లతో గెలిచిన జెడ్పీటీసీ సభ్యులకు జెడ్పీలో సముచిత గౌరవం దక్కడం లేదని ఆరోపించారు. సభ్యులతో చర్చించి, ఆమోదం తెలపాల్సిన పనులను ఏకపక్షంగా ఆమోదించేస్తూ జెడ్పీటీసీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తే, తమపై ఎదురుదాడికి దిగుతున్నారని అన్నారు. 2025–26, 2026–27 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన బడ్జెట్ను ఆమోదించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే నిధులు లేకుండా ముందస్తు అనుమతులు ఇచ్చిన పనులకు ఎట్టి పరిస్థితుల్లోనే అంగీకారం తెలిపేది లేదని స్పష్టం చేశారు.
● ఇదే అంశంపై పిడుగురాళ్ల జెడ్పీటీసీ సభ్యుడు జంగా వెంకట కోటయ్య మాట్లాడుతూ జెడ్పీకి వచ్చే నిధులకు, కేటాయిస్తున్న పనులకు మధ్య పొంతన ఉండటం లేదన్నారు. జెడ్పీటీసీలకు తెలియకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. నిధుల లభ్యత లేకుండా పనులు కేటాయిస్తే, బిల్లులు ఏ విధంగా చెల్లిస్తారో చెప్పాల్సిన బాధ్యత చైర్పర్సన్తోపాటు అధికారులకు కూడా ఉందన్నారు.
జెడ్పీటీసీలకు సరైన సమాధానం ఇవ్వండి
ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలు తీర్చేందుకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. వచ్చే వేసవి దృష్ట్యా దీనికే అత్యధిక ప్రాధాన్యమివ్వాలని, నిధులు లేకుండా రోడ్లు, కాలువల నిర్మాణాలను చేపట్టాల్సిన అవసరం లేదన్నారు. జెడ్పీటీసీ సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలపై సమగ్రంగా చర్చ జరగాల్సిన అవసరమందని పేర్కొన్నారు. అజెండాను తిరస్కరించడం కాకుండా వాయిదా కోరాలని వైఎస్సార్ సీపీ సభ్యులకు సూచించారు. నిధుల లభ్యత లేకుండా అజెండాలో పొందుపర్చిన పనులకు బిల్లులు చెల్లించే బాధ్యతను చైర్పర్సన్తోపాటు అధికారులు కూడా తీసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దీనిపై చైర్పర్సన్తోపాటు అధికారులు కూడా సరైన సమాధానం ఇవ్వలేదు.
పత్రికలకు ఎక్కుతున్నారని ఆక్రోశం
నిధులు లేకుండా పనుల కేటాయింపులపై వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలు మూకుమ్మడిగా ప్రశ్నలు సంధించడంతో ఇరకాటంలో పడిన చైర్పర్సన్ హెనీ క్రిస్టినా నేరుగా సమాధానం చెప్పకుండా, తనకు వ్యతిరేకంగా పత్రికల్లో వార్తలు రాయిస్తున్నారని ఎదురుదాడికి దిగారు. జెడ్పీలో జరుగుతున్న వ్యవహారాలపై పత్రికల్లో వార్తలు రాస్తున్నారని, ఇందులో తమ ప్రమేయం లేదని జెడ్పీటీసీలు సమాధానం ఇచ్చారు. చైర్పర్సన్ తీరును తీవ్రంగా వ్యతిరేకించిన పిల్లి ఓబుల్రెడ్డి, బత్తుల అనూరాధ, శొంటిరెడ్డి నర్సిరెడ్డి, ఈడ్పుగంటి కరుణకుమారి, తుమ్మా విజయప్రతాప్, తుర్లపాటి చౌడయ్య, ఎం.పెదమల్లుస్వామి, జంగా వెంకట కోటయ్య, కాట్రగడ్డ మస్తాన్రావు, పదముత్తం చిట్టిబాబు, జున్నెబెయిన హరీష్, కంకణాల స్వర్ణకుమారి, కో ఆప్షన్ సభ్యుడు షేక్ సర్దార్ హష్మి తదితరులు సమావేశంలో నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో అజెండాలోని అంశాలను ఆమోదించేందుకు కోరం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు చివరికి చైర్పర్సన్ హెనీ క్రిస్టినా ప్రకటించారు.
7
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు


