జిల్లా అభివృద్ధికి సూచనలు ఇవ్వండి
ఎమ్మెల్యేలను కోరిన మంత్రి గొట్టిపాటి
నరసరావుపేట: జిల్లా అభివృద్ధికి సూచనలు ఇవ్వాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ కోరారు. కలెక్టరేట్లో శనివారం సాయంత్రం జిల్లా అభివృద్ధిపై ఎమ్మెల్యేలు, అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా సమావేశం నిర్వహించారు. దీనిలో పాల్గొన్న చీఫ్ విప్ ఆంజనేయులు, ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, ప్రత్తిపాటి పుల్లారావు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ఎస్పీ కృష్ణారావు, జాయింట్ కలెక్టర్ సంజనా సింహలను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. తక్కువ వ్యయంతో విధానపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా ఎక్కువ ప్రభావం చూపే ఆలోచనలు తమ ముందు ఉంచాలని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో మెగా టూరిజం హబ్, కొండవీడు కోట అభివృద్ధి, పల్నాడు జిల్లాను పూర్ణోదయ పథకం పరిధిలోకి తీసుకురావడం, లింగంగుంట్ల భూముల సమస్య వంటి అంశాలను ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆర్డీఓలు పాల్గొన్నారు.


