ప్రకృతి వ్యవసాయం భావితరాలకు వరం
నరసరావుపేట రూరల్: ప్రకృతి వ్యవసాయం భావితరాలకు వరమని డీపీఎం కె.అమలకుమారి తెలిపారు. మండలంలోని పెదరెడ్డిపాలెంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఏటీఎం మోడల్ను శుక్రవారం ఆమె సందర్శించారు. ఆమె మాట్లాడుతూ నిరంతరం ఆదాయం అందించే ఏటీఎం మోడల్ను ప్రతి రైతు తప్పనిసరిగా అవలంభించాల్సిన అవసరం ఉందని తెలిపారు. బీట్రూట్, చెట్టు చిక్కుడు, ముల్లంగి, ఉల్లి, క్యారట్, కొత్తిమీర, కాకర, టమాటా వంటి పంటలను సాగు చేయడం ద్వారా ప్రతి నెలా ఆదాయం లభిస్తుందని తెలిపారు. ప్రధాన పంటలకు అయ్యే ఖర్చు అంతర పంటల ద్వారా ముందుగానే రైతులకు తిరిగి లభిస్తుందని వివరించారు. విభిన్న రకాల పంటలను సాగు చేయడం వలన భూమిలో జీవవైవిద్యం పెరిగి నేల మరింత సారవంతంగా మారుతుందని తెలిపారు. రసాయన వ్యవసాయం వలన నేల, నీరు, మానవ ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. ప్రస్తుత పరిస్దితుల్లో ప్రకృతి వ్యవసాయం ద్వారానే సుస్ధిర వ్యవసాయం సాధ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిబ్బంది సౌజన్య లక్ష్మీ, బేబిరాణి, శివయ్య తదితరులు పాల్గొన్నారు.


